న్యూఢిల్లీ: బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపై భారత వైమానిక దళం చేసిన దాడులకు కావల్సినన్ని సాక్ష్యాలున్నాయని భారత వైమానిక దళ ప్రధానాధికారి బీఎస ధనోవా అన్నారు. కానీ పాకిస్థాన్ మాత్రం తమకు జరిగిన నష్టాన్ని అంగీకరించడానికి ఒప్పుకోవడం లేదని చెప్పారు. నేలకూలిన నిర్మాణాల రూపంలో కళ్లెదుటే సాక్ష్యాలున్నా పాక్ కాదంటోందని చెప్పారు. భారత యుద్ధ విమానాలు కచ్చితంగా తమ లక్ష్యాలను ఛేదించాయని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ పాప్ గాయకుడు బాబ్ డైలన్ పాటను ఆయన గుర్తుచేశారు. ‘‘అది నీ కళ్ల ముందే ఉన్నా, నువ్వు చూడాలనుకోకపోతే.. నేను కేవలం డైలన్ ను గుర్తుచేయగలను’’ అని ధనోవాల చెప్పారు. ‘‘ఎన్నిసార్లు ఒక వ్యక్తి తల పక్కకు తిప్పగలడు, చూడలేదని నటించగలడు, దానికి సమాధానం.. గాల్లోనే తిరుగుతోంది’’ అని అర్థం వచ్చే డైలన్ పాటను ఆయన పాడి వినిపించారు. 1963 నాటి ‘ద ఫ్రీవీలింగ్’ ఆల్బంలో ఈ పాట ఉంటుంది.
పుల్వామాలో ఫిబ్రవరి 14న ఆత్మాహుతి దాడికి పాల్పడి 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను జైషే మహ్మద్ బలిగొంది. దానికి సమాధానంగా భారత వైమానిక దళం సరిగ్గా 12 రోజుల తర్వాత బాలాకోట్ ప్రాంతంలో వైమానిక దాడులు జరిపింది. మిరేజ్ విమానాలు మూడు లక్ష్యాలను ఛేదించాయి.
బాంబులు పడేదిలా..
ఇజ్రాయెల్ లో తయారైన స్పైస్ 2000 తరహా బాంబులను భవనాల మీద విసరడంతో అవి పేలి.. గరిష్ఠ నష్టం కలగజేశాయి. ఒక్కో బాంబులో 80 కిలోల పేలుడు పదార్థాలు, 900 కిలోల స్టీలు కేసింగ్ ఉంటుంది. బాంబు వేసిన కాసేపటి తర్వాత పేలుడు సంభవించడంతో భవనంలోపల ఉన్నవాళ్లు ఎవరూ బతికే అవకాశం కూడా ఉండదని ఒక వైమానిక దళాధికారి చెప్పారు. బాంబులు నిలువుగా పడటంతో శ్లాబు మీద 80-90 సెంటీమీటర్ల వ్యాసంతో రంధ్రం పడుతుంది. అది పడుతోందని చూసేలోపే పేలుతుంది కాబట్టి ఎవరూ తప్పించుకోడానికి కూడా వీలుండదు.
ప్రతిపక్షాలకు సమాధానమా?
ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో, ప్రతిపక్షాలు ఇప్పటికీ వైమానిక దళ దాడులపై ప్రశ్నిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. సరిగ్గా ఆ తర్వాతే వైమానిక దళ ప్రధానాధికారి విలేకరుల సమావేశం నిర్వహించి మరీ దాడుల గురించి వివరంగా చెప్పడంతో.. ఇది ఒక రకంగా ప్రతిపక్షాలకు సమాధానం ఇప్పించడమేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.