కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య గణణీయంగా పెరుగుతున్నాయి. నేటి వరకు దేశంలో 27,67,273 కరోనా కేసులు నమోదు కాగా 20,37, 870 మంది కోలుకొని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24గంటల వ్యవధిలో భారత్ లో 64,531 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 1092 మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 52,889కి చేరింది. 6,76, 514 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా ఎప్పుడు పోతుందా, సాధారణ జీవనం ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ కరోనా మహమ్మారి బారిన సామాన్యులతో పాటు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు, సెలబ్రిటీలు పడుతున్నారు. కొందరు కరోనాను జయించి కులాసాగా ఇళ్లకు వెళుతుండగా పలువురు మృతి చెందుతున్నారు. మరి కొందరు మృత్వువుతో పోరాడుతున్నారు. కరోనా సోకిన హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, సెలబ్రిటీలు అమితాబచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహన్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు యడ్డ్యూరప్ప, సిద్ద రామయ్య, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, తదితరులు ఆసుపత్రుల్లో చికిత్స అనంతరం కోలుకోగా ఉత్తర ప్రదేశ్ విద్యా శాఖ మంత్రి కమల్ రాణి, ఏపీలో మాజీ మంత్రి మాణిక్యాలరావు తదితరులు కరోనాను జయించలేకపోయారు.
విషమంగా ప్రణబ్, బాలు ఆరోగ్యం
కరోనా బారిన పడ్డ భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ , ప్రముఖ గాయకుడు బాలసుబ్రమణ్యంల ఆరోగ్యాలు విషమంగా ఉన్నాయి. ప్రణబ్ ముఖర్జీ ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, తాజాగా అయన ఊపిరితిత్తులకు ఇంఫెక్షన్ సోకినట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ప్రజల ప్రార్ధనల ఫలితంగా తన తండ్రి కోలుకుంటున్నట్లు అభిజిత్ ముఖర్జీ తొలుత ట్వీట్ చేశారు. మరో పక్క ప్రముఖ గాయకుడు బాలసుబ్రమణ్యం చెన్నై ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయన పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు హెల్త్ బులిటెన్ లో వెల్లడించారు. కాగా కరోనాతో పోరాడుతున్న ప్రణబ్ ముఖర్జీ, బాలసుబ్రమణ్యం త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రజలు, అభిమానులు కోరుకుంటున్నారు. చిలుకూరి బాలాజీ టెంపుల్ లో గాన గంధర్వుడు బాలు కరోనా నుండి త్వరగా కోలుకోవాలంటూ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రణబ్ ముఖర్జీ
సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన ప్రణబ్ ముఖర్జీ 1973లో కేంద్ర కేబినెట్లో అడుగు పెట్టారు. నెహ్రూ కుటుంబంలోని మూడు తరాల నేతలకు ప్రణబ్ ముఖర్జీ సన్నిహితుడు. మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక మంత్రిగా ప్రణబ్ తన సేవలనంచించాడు. లోక్సభకు నాయకునిగా కూడా పనిచేసాడు.
ఎస్ పీ బాలసుబ్రమణ్యం
ఎస్ పీ. బాలసుబ్రహ్మణ్యం పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. నేపథ్య గాయకుడుగా, సంగీత దర్శకుడుగా, నటుడుగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన బాలసుబ్రమణ్యం ..తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడాడు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు.