బిహెచ్యు సౌత్ కాంపస్ డిప్యూటీ చీఫ్ ప్రోక్టర్ కిరణ్ దామ్లేకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఆరెస్సెస్ సభ్యులు
వారణాసి: బెనారస్ హిందూ యూనివర్సిటీ (బిహెచ్యు) ఇటీవల ఎక్కువగా వార్తల్లోకి ఎక్కుతోంది. దానికి కనబడుతున్న కారణాలు మాత్రం ప్రజాస్వామికవాదులకు చాలా నిరుత్సాహం కలిగించేవి. ఇంకా చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్నీ, సెక్యులరిజాన్నీ తీవ్రంగా బలహీనపరిచేవి. మితవాద హిందుత్వభావజాలం ఉన్న విద్యార్ధులు యూనివర్సిటీని తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు చాలా మొరటుగా ప్రయత్నిస్తున్నారు. రాజ్యాంగం మూలసూత్రాలనూ, చట్టాలనూ ఏమాత్రం ఖాతరు చేయకుండా వ్యవహరిస్తున్నారు. తమ మాటే చెల్లుబాటు కావాలని యూనివర్సిటీ యాజమాన్యాన్ని శాసిస్తున్నారు. ఇటీవల సంభవించిన రెండు పరిణామాలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
యూనివర్సిటీ సంస్కృత విభాగంలోకి ఇటీవల ఫిరోజ్ ఖాన్ అనే ముస్లింను అసిస్టెంట్ ఫ్రొఫెసర్గా తీసుకున్నారు. అతని నియామకాన్ని వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్ధులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న శుభం తివారీ అనే పిహెచ్డి స్కాలర్ తమ వైఖరికి మద్దతుగా విచిత్రమైన వాదన చేస్తున్నాడు. సంస్కృతం విభాగం శంఖుస్థాపన ఫలకంపై, హిందువులు, జైనులు, బౌద్ధులు, ఆర్యసమాజం సభ్యులు తప్ప ఎవరికీ ఇందులోకి ప్రవేశం లేదని రాసి ఉందట. బెనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపకుడు మదన్ మోహన్ మాలవీయ ఆ ఫలకంపై అలా రాయించారట. ఈ విషయాన్ని ధృవీకరించుకోలేకోయామని ద హిందూ దినపత్రిక రాసింది.
ఒకవేళ అలా రాసిఉన్నా రాజ్యాంగం ప్రకారం అది చెల్లుబాటు కాదన్న విషయాన్ని తివారీ అంగీకరించడం లేదు. అది దేశానికి స్వాతంత్ర్యం రాకముందు రాసిన మాట అనీ, అప్పటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదనీ సంస్కృత విభాగం అధిపతి ఉమాకాంత్ చతుర్వేది అంటున్నారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు పూర్తి అనుగుణంగా ఫిరోజ్ ఖాన్ నియామకం జరిగిందని యూనివర్సిటీ యాజమాన్యం చెబుతున్నది. బెనారస్ హిందూ యూనివర్సిటీ చట్టంలోని నిబంధనలను కూడా తాము ఎక్కడా ఉల్లంఘించలేదని యాజమాన్యం వాదిస్తున్నది. ఆందోళన చేస్తున్న విద్యార్ధులు మాత్రం ససేమిరా అంటున్నారు. దానితో బెనారస్ హిందూ యూనివర్సిటీ చట్టం విషయంలో న్యాయనిపుణుల సలహా తీసుకుంటామని యాజమాన్యం పేర్కొన్నది.
రెండవ సంఘటన మంగళవారం జరిగింది. యూనివర్సిటీ సౌత్ కాంపస్ గ్రౌండ్లో మంగళవారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శాఖ (సమావేశం) జరుగుతున్నది. అక్కడ ఒక ఆరెస్సెస్ జెండా పాతారు. సౌత్ కాంపస్ డిప్యూటీ చీఫ్ ప్రోక్టర్ కిరణ్ దామ్లే వెళ్లి ఆ జెండా తొలగించారు. దానితో ఆరెస్సెస్ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే ఆమెపై క్రిమినల్ కేసు పెట్టారు. విషయం అంతటితో ఆగలేదు. కిరణ్ దామ్లెతో రాజీనామా చేయించారు. యూనివర్సిటీ యాజమాన్యం ఆమె పక్షాన మాట్లాడుతున్నది కానీ జెండా తొలగించి ఆమె తప్పు చేయలేదని వాదించడం లేదు. ఆమెపై ఫిర్యాదు ఉపసంహరించుకోవాల్సిందిగా ఆరెస్సెస్ను కోరతామని యాజమాన్యం అంటున్నది. బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఇలాంటి పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి.