హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయను గవర్నర్ పదవి వరించింది. ఆదివారం ఐదు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను కేంద్రం ప్రభుత్వం నియమించిది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా బండారు దత్తాత్రేయను నియమించినట్టు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా ఉన్న కలరాజ్ మిశ్రాను రాజస్థాన్కు బదిలీ చేశారు.
బండారు దత్తాత్రేయ.. బీజేపీలో కీలక నేతగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఆయన పార్టీలో పలు కీలక పదవులు చేపట్టారు. చట్ట సభల్లోనూ అడుగుపెట్టి.. కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు. 1947 ఫిబ్రవరి 26న జన్మించిన దత్తాత్రేయ.. 1965 రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరారు. 1980లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా, 89లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, 96 నుంచి 98 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. నాలుగసార్లు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. తొలిసారి 1991లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించారు. 1998, 99, 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచే గెలిచి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అనంతరం 2014లో మోదీ ప్రభుత్వం తొలి కేబినెట్లో కార్మికశాఖ మంత్రిగా దత్తాత్రేయ బాధ్యతలు చేపట్టారు. అయితే, కేంద్ర కేబినెట్ విస్తరణ సమయంలో తన పదవి కోల్పోయారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం దత్తాత్రేయకు రాలేదు. ఈ స్థానం నుంచి జి.కిషన్ రెడ్డి పోటీ చేసి గెలిపొందారు. కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించిన తరువాత దత్తన్నను తమిళనాడు గవర్నర్గా నియమించనున్నారనే ప్రచారం సాగింది. అయితే, రెండేళ్ల తర్వాత ఇప్పుడు గవర్నర్ పదవి వరించింది. ఆయనకు గవర్నర్ పదవి దక్కుడంతో బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు.