కోల్కతా: కాషాయరంగు టీషర్టులు వేసుకున్న కొంతమంది యువకులు విద్యాసాగర్ కాలేజి హాస్టల్ వెలుపల ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నట్లు ఒక వీడియో క్లిప్ బయటకొచ్చింది. మరో క్లిప్లో మాత్రం అవే కాషాయ టీషర్టులు వేసుకుని, బీజేపీ జెండాలు పట్టుకున్న యువకులపై కాలేజి లోపలి నుంచి వేరే బృందం పెద్ద పెద్ద రాళ్లు విసురుతున్నట్లు కనిపించింది. కోల్కతా పోలీసులు ఈ రెండు వీడియోలతో పాటు మరిన్ని సాక్ష్యాధారాలను పరిశీలిస్తున్నారు. టీఎంసీ విద్యార్థి విభాగం తృణమూల్ ఛాత్ర పరిషత్కు, బీజేపీ కార్యకర్తలకు మధ్య అమిత్ షా ర్యాలీ సందర్భంగా భారీ ఙంస చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం ఎవరన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
హింసకు సంబంధించి కారణం మీరంటే మీరంటూ ఒకరిపై ఒకరు చెప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ద ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రతినిధులు పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు, రెండు పార్టీల కార్యకర్తలతో మాట్లాడి అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. టీఎంసీపీ నాయకులు బీజేపీ ర్యాలీ మార్గంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ముందే భావించారు. బీజేపీ కూడా అవాంఛిత ఘటనల నిరోధానికి సిద్ధంగా ఉంది.
ఇప్పటివరకు తాము అరెస్టుచేసిన మొత్తం 58 మందీ బీజేపీ మద్దతుదారులేనని పోలీసులు చెప్పారు. వీరిలో ఎక్కువ మంది హూగ్లీ, బర్ద్వాన్, ఉత్తర 24 పరగణాలు, టిటాగఢ్ ప్రాంతాలకు చెందినవారు. స్థానికుల నుంచి, సోషల్ మీడియా నుంచి వీడియోలు తీసుకున్నామని, బయటివాళ్లే లోపలకు ప్రవేశించి, హాస్టల్ను చిందరవంద చేసి, విగ్రహం ధ్వంసం చేశారని ఓ పోలీసు అధికారి తెలిపారు. రోడ్షో ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేటుకు తాళం వేయాలని కాలేజి హాస్టల్ కేర్టేకర్ ఎస్ఆర్ మొహంతికి చెప్పారు. అయితే ర్యాలీలో వచ్చిన 50-60 మంది గేటు తోసుకుని బలవంతంగా లోపలకు వచ్చారని, వాళ్లు లోపలకు బాటిళ్లు విసిరారని, తాను పై అంతస్తులోకి వెళ్లగా కొందరు విద్యార్థులు వెనకవైపు వచ్చారని అన్నారు. పోలీసులు వచ్చేలోపే విగ్రహం, ఫర్నిచర్ ధ్వంసం చేశారన్నారు.
తాను రెండో అంతస్థులోకి వెళ్లి దాక్కోవాల్సి వచ్చిందని జర్నలిజం విద్యార్థిని ఒకరు చెప్పారు. ఫర్నిచర్ పగలగొట్టే ప్రతిసారీ వాళ్లు జైశ్రీరాం అన్నారని, తాను మరో ఇద్దరు స్నేహితులతో కలిసి పై అంతస్తుకు వెళ్లిపోయానని, తర్వాత పోలీసులు వచ్చి మూకను చెదరగొట్టారని తెలిపారు.
అయితే, బీజేపీ నాయకుడు ముకుల్ రాయ్ మాత్రం ఈ ఘటన వెనుక ఎవరున్నారో నిరూపించేందుకు తమ వద్ద ఫొటోలున్నాయని చెప్పారు. ర్యాలీ ఎప్పుడో ముందే నిర్ణయించి పోలీసుల అనుమతి కూడా తీసుకున్నామని, అలాంటప్పుడు దానికి ఆటంకం కలిగించేందుకు టీఎంసీపీని ఎందుకు అనుమతించారని ఆయన ప్రశ్నించారు. తామంతా విద్యాసాగర్ను గౌరవిస్తామన్నారు. విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది ఎవరైనా సరే ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించి కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి సప్తర్షి సర్కార్ డిమాండ్ చేశారు. కానీ తగినంత పోలీసు భద్రత కల్పించకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని మండిపడ్డారు. రోడ్డు షో ప్రశాంతంగా సాగుతుంటే తమపై లోపలి నుంచి రాళ్లు విసిరారని బీజేపీ కార్యకర్తలు చెబుతున్నారు. హాస్టల్ పై నుంచి రాళ్లు విసిరారని, తమలో కొందరు గాయపడ్డారని, ఎలాంటి కారణం లేకుండా తమవాళ్లు హాస్టల్లోకి ఎందుకు వెళ్తారని ప్రశ్నించారు.
ఘర్షణలు కనీసం అరగంట పాటు జరిగాయని ఆ ప్రాంతంలోని నగలదుకాణం యజమాని అరవింద్ సింగ్ చెప్పారు. టీఎంసీ వాళ్ల కంటే బీజేపీ వాళ్లు ఎక్కువ మంది ఉన్నారని, కానీ అసలక్కడ పోలీసులే కనపడలేదని అన్నారు. ముందుగా లోపలి నుంచి రాళ్లు విసరడంతో ఆ తర్వాత బీజేపీ వాళ్లు లోపలకు వెళ్లి అంతా ధ్వంసం చేశారని తెలిపారు. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజేష్ సింగ్ ఒక వాట్సాప్ గ్రూపులో ఇలా చెప్పారు… రేపటి రోడ్షోలో ఇబ్బందులు రావచ్చు. ఎంత సమస్య ఉన్నా మీరు తప్పక హాజరుకావాలి. ఎనిమిది అడుగుల కర్రలతో మనం పోలీసులు, టీఎంసీ గూండాలను ఎదుర్కోవాలి… అన్నారు. అయితే, అదంతా ఆత్మరక్షణ కోసమే తాను చెప్పానని ఆయన తెలిపారు. అవతలివాళ్లు దాడిచేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకోవాలని ప్రశ్నించారు.