న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో అందె వేసిన చేయి అయిన మేఘాలయ గవర్నర్ తథాగత్ రాయ్ మరోసారి వార్తలకెక్కారు. బెంగాలీ గొప్పతనం గతించిపోయిన వ్యవహారమనీ, ఇప్పుడు బెంగాలీ యువకులు గదులు ఊడ్చే ఉద్యోగాలు చేస్తున్నారనీ, బెంగాలీ యువతులు ముంబై బార్లలో డాన్స్ చేస్తున్నారనీ ఆయన ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. తృణమూల్ కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలపై నిరసనకు సిద్ధమవుతోంది.
బెంగాల్కు చెందిన తథాగత్ రాయ్ బిజెపి నాయకుడు. గవర్నర్ పదవి స్వీకరించిన తర్వాత కూడా ఆయన వాచాలత తగ్గలేదు. ఆయన తాజా కామెంట్లు హిందీ తప్పనిసరి అన్న నిబంధనకు బెంగల్లో ఎదురయిన వ్యతిరేకత చూసి చేసినవి. హిందీయేతర రాష్ట్రాలలో విద్యార్ధులు హిందీ తప్పనిసరిగా చదవాలని నూతన విద్యావిధానం ముసాయిదాలో పేర్కొనడంపై బెంగాల్ సహా చాలా హిందీయేతర రాష్ట్రాలలో నిరసనలు చెలరేగాయి. దానితో కేంద్రం వెనుకకు తగ్గి ఆ నిబంధనను తొలగించింది.
నిజానికి బెంగాల్లో కూడా హిందీకి గొప్ప వ్యతిరేకత లేదనీ, రాజకీయ కారణలతో వ్యతిరేకిస్తున్నారనీ తథాగత్ రాయ్ పేర్కొన్నారు. అదేమంటే బెంగాల్ విద్యాసాగర్, వివేకానంద, రబీంద్రనాధ్, నేతాజీ పుట్టిన గడ్డ అంటారు. అదంతా గతం. ఇప్పుడు బెంగాలీ యువకులు హర్యానా నుంచి కేరళ వరకూ గదులు ఊడుస్తున్నారు. యువతులు ముంబై బార్లలో డాన్స్ చేస్తున్నారు, అని ఆయన బెంగాలీలో ట్వీట్ చేశారు.