హోరాహోరీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలుపొందారు. రిపబ్లికన్ అభ్యర్థి, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆశలు గల్లంతు అయ్యాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠకు పేన్సెల్వేనియా ఓట్ల ఫలితం వెల్లడితో తెరపడింది.
మొత్తం 20 ఎలక్ట్రోరల్ ఓట్లు ఉన్న పెన్సెల్వేనియాలో జో బైడెన్ ఆధిక్యం కనబర్చడంతో అధ్యక్ష ఎన్నికల ఫలితంపై నెలకొన్న సస్పెన్స్కు తెరపడింది. మ్యాజిక్ ఫిగర్ 270 ఎలక్ట్రోరల్ ఓట్లు కాగా జో బైడన్కు 284 ఎలక్ట్రోరల్ ఓట్లు వచ్చాయి. దీంతో 46వ అమెరికా అధ్యక్షుడుగా జో బైడెన్ ఎన్నిక అయ్యారు. ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నికయ్యారు. నార్త్ కరోలినా ఫలితం తేలకపోవడంతో ట్రంప్కు ఇప్పటి వరకూ 214 ఎలక్ట్రోరల్ ఓట్లు మాత్రమే వచ్చాయి.
గత కొద్ది రోజులుగా అయిదు రాష్ట్రాల్లో ఉత్కంఠగా ఓట్లు లెక్కింపు సాగుతున్న సంగతి తెలిసిందే. పోలింగ్లో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఆసక్తిగా ఎదురుచూశాయి.