(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
హుజూర్నగర్ ఎన్నికల ప్రచారానికి ఇవాళ్టితో తెరపడనుంది. ఈ ఉపఎన్నికలో గెలుపును అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ కంచుకోట అయిన హుజూర్ నగర్లో ఎలాగైనా ఈసారి గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. సిట్టింగ్ స్థానం కాబట్టి ఈ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడం కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి ఈ స్థానం నుంచి పోటీ చేస్తుండడంతో ఈ సీటును ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. దీంతో పోటీ ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యే కనిపిస్తోంది.
హుజూర్నగర్ ఉప ఎన్నిక తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించినప్పటి నుంచి అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తించారు. ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి నెల రోజులుగా ప్రధాన పార్టీలు విస్తృతంగా ప్రచారం సాగించాయి. తమ కంచుకోటను తిరిగి దక్కించుకుంటామని కాంగ్రెస్ చెబుతుంటే… ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. 40 ఏళ్లలో జరగని అభివృద్ధిని… నాలుగేళ్లలో చేసి చూపిస్తామని టీఆర్ఎస్ చెబుతోంది. కేటీఆర్ సహాలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అయితే, సీఎం కేసీఆర్ కూడా భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావించారు. అయితే, వాతావరణం అనుకూలించక పోవడం, హుజూర్నగర్ లో భారీ వర్షం పడటంతో కేసీఆర్ సభ రద్దైంది. దీంతో తొలిసారిగా కేసీఆర్ ప్రచారం లేకుండానే ఈ ఉపఎన్నిక జరగనుంది. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి ఏ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఇతర పార్టీల దగ్గరకు పొత్తుకోసం వెళ్ళింది లేదు. అసెంబ్లీ ఎన్నికల కోసం కానీ, పార్లమెంట్ ఎన్నికలప్పుడు కానీ గులాబీ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగింది. అన్నీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. అయితే, హుజూర్ నగర్ ఉపఎన్నికలో మాత్రం సీపీఐ మద్దుతు కోరింది. అయితే, సీపీఐ మొదట టీఆర్ఎస్ కి మద్దతు ప్రకటించినప్పటికీ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో వెనక్కి తీసుకుంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ స్థానం నుంచి గెలుపొందిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. నల్గొండ ఎంపీగా ఎన్నిక కావడంతో హుజూర్నగర్ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. బరిలో టీడీపీ, బీజేపీ కూడా ఉన్నప్పటికీ…. పోటీ ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే జరుగుతోంది. అక్టోబర్ 21న పోలింగ్, 24న ఫలితాలు ప్రకటిస్తారు. గత ఎన్నికల్లో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని టీఆర్ఎస్ తగు జాగ్రత్తలు తీసుకుంది. హుజూర్నగర్ లో తమ పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆర్టీసీ కార్మికుల సమ్మె తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె జురుగుతున్న వేళ… దీని ప్రభావం ఎన్నికలపై పడుతుందేమోనన్న ఆందోళన టీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తోంది. దీంతో హుజూర్నగర్ ఉపఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందా? హుజూర్నగర్ లో కారు దూసుకెళ్తుందా? తెలియాలంటే ఫలితాల వరకు ఆగాల్సిందే.