(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
బిహార్లోని గయలో దారుణ ఘటన జరిగింది. అత్యాచారానికి గురైన ఓ బాధితురాలికే శిక్ష వేశారు పంచాయితీ పెద్దలు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గయకి చెందిన ఓ యువతిని ఈ నెల 14వ తేదీన అదే ప్రాంతానికి చెందిన ఆరుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. స్థానిక పంచాయతీ భవనంపైకి యువతిని తీసుకువెళ్లి…పలుమార్లు అత్యాచారం చేశారు. దీంతో యువతి స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయింది. మరుసటి రోజు ఓ గ్రామస్తుడు చూసి యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. నిందితులను శిక్షించాలని కోరుతూ యువతి తల్లిదండ్రులు పంచాయతీని ఆశ్రయించారు. అయితే, నిందితుల కుటుంబ సభ్యులు, బంధువులకు గ్రామంలో పలుకుబడి ఉంది. దీంతో బాధితురాలికి న్యాయం చేయాల్సిన పంచాయతీ పెద్దలు.. యువతిదే తప్పు అని తేల్చి శిక్ష విధించారు. అంతేకాదు బాధితురాలికి గుండు చేయించి ఊరిలో ఊరేగించారు.
దీనిని బాధిత కుటుంబం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటన జరిగిన 11 రోజుల తర్వాతే పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత యువతికి శిక్ష వేసిన ఐదురుగు పంచాయతీ పెద్దలపై సైతం పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న బిహార్ మహిళా కమిషన్ చైర్పర్సన్ దిల్మానీ మిశ్రా.. గయ ఎస్పీకి లేఖ రాశారు. సెప్టెంబర్ 2న పంచాయతీ సభ్యులను తమ ఎదుట హాజరు పరచాలని ఆదేశించారు.