(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
గోవాలో పార్టీ ఫిరాయించడానికి సిద్ధపడిన కాంగ్రెస్ శాసనసభ్యులను చేర్చుకుని బలం పెరిగిందని బిజెపి నాయకత్వం సంబరపడుతోంది. అయితే ఆ సంబరంలో కార్యకర్తలు పాలు పంచుకోవడం లేదు. చాలామంది కార్యకర్తలు తాము సంతోషంగా లేమని అంటున్నారు.
నేను పూర్తిగా నైతిక స్థైర్యం కోల్పోయాను. వారిని పార్టీలోకి చేర్చుకోవడం, మంత్రి పదవులు ఇవ్వడం ఏ మాత్రం సరైన పని కాదు. బిజెపి ఇక భిన్నమైన పార్టీ ఎలా అవుతుంది. నాయకులు ప్రజల దగ్గరకు వెళ్లరు. మేము వెళ్లాలి. వారికి ఏం సమాధానం చెబుతాం అని సుమంత్ జాగ్లేకర్ అనే కార్యకర్త ఎన్డిటివితో అన్నారు. సుమంత్ తండ్రి గోవాలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుల్లో ఒకరు.
సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ తెంగ్సె గత ఎన్నికలలో బిజెపికి వోటు వేశారు. ఆయన కూడా బిజెపి చర్య పట్ల సంతోషంగా లేరు. ఫిరాయించిన శాసనసభ్యులలో బాబుష్ మాన్సరేట్ ఒకరు. ఆయనపై మానభంగం కేసు నడుస్తోంది. రెండు నెలల క్రితం పాంజిమ్ ఉపఎన్నికలో బిజెపి అభ్యర్ధిపై ఆయన గెలిచారు. ఇప్పుడు బాబుష్ను పార్టీలోకి చేర్చుకోవడం సిగ్గుచేటు పని అంటారు అరవింద్ తెంగ్సె. బిజెపికి వోటు వేసిన మహిళలకు ఏమని చెబుతారని ఆయన ప్రశ్నించారు.
ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా వర్తిస్తుంది. వారు కూడా ఫిరాయిపు దారుల పట్ల ఆగ్రహంగా ఉన్నారు. కష్టపడి తాము గెలిపించిన శాసనసభ్యులు వేరే పార్టీలోకి వెళ్లడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఫిరాయింపుదారులు మళ్లీ అక్కడ ఎన్నిక కాలేరని ఫ్లోరియానో కొలాకో అనే కాంగ్రెస్ కార్యకర్త ఎన్డిటివితో అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్ కుమారుడు ఉత్పల్ తన ప్రకటన ద్వారా బిజెపి నాయకత్వానికి పంపిన సందేశం ఇదే. తన తండ్రి నడిచిన దారి నుండి బిజెపి మళ్లిందని ఆయన అన్నారు. 15 మంది కాంగ్రెస్ శాసనసభ్యులలో పది మంది బిజెపికి ఫిరాయించారు. వారిలో ముగ్గురికి ఈ రోజు మంత్రి పదవులు ఇవ్వనున్నారు.
ఫిరాయించిన శాసనసభ్యులు అందరూ క్రిష్టియన్ మైనారిటీలు కాబట్టి బిజెపికి ఆ వర్గం వోట్లు వస్తాయని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. అయితే ఆ అంచనా తప్పనీ, ఆ వోట్లు అన్నీ కాంగ్రెస్ వోట్లు తప్ప ఎవరి వ్యక్తిగత వోట్లూ కావనీ కాంగ్రెస్ నాయకుడు ఎమర్సన్ వాజ్ పేర్కొన్నారు.