కోల్కతా: పశ్చిమ బెంగాల్లో మూడు నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరుగుతున్న వేళ.. ఓ బీజేపీ అభ్యర్థిపై దాడి జరిగింది. ఖరగ్పూర్ సదర్, కలియాగంజ్, కరీంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కరీంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి జయప్రకాశ్ మజుందార్పై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన జయప్రకాశ్పై తృణమూల్ కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. పోలింగ్ కేంద్రం బయట.. జయప్రకాశ్ను కాళ్లతో తన్నుతూ.. చెట్లలోకి తోసేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసు బలగాలు కార్యకర్తలను చెదరగొట్టారు.
#WATCH West Bengal BJP Vice President and candidate for Karimpur bypoll, Joy Prakash Majumdar manhandled and kicked allegedly by TMC workers as voting is underway in the constituency. #WestBengal pic.twitter.com/Vpb5s14M5A
— ANI (@ANI) November 25, 2019
ఈ దాడితో బెంగాల్ లో ప్రజాస్వామ్యం అంతం అయిందని మజుందార్ అన్నారు. తాను అన్ని పోలింగ్ బూత్ లను సందర్శిస్తానని చెప్పారు. ఈ ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేశారని తెలిపారు. మరోవైపు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకుడు ముకుల్ రాయ్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ‘ ఈ రోజు 50 మంది టిఎంసి గుండాలు బీజేపీ అభ్యర్థి జయప్రకాశ్ మజుందార్పై దాడి చేశారు. దీనిని అడ్డుకోవడంలో పోలీసులు విఫలం అయ్యారు. పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయలేదు. ఎస్పీని వెంటనే తొలగించాలి ’ అని ముకుల్ రాయ్ తన లేఖలో పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల అనంతరం ప్రస్తుం పశ్చిమబెంగాల్ లోని ఖరగ్పూర్ సదర్, కలియాగంజ్, కరీంపూర్ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మూడు చోట్ల ప్రధాన పార్టీలయిన తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షలు పోటీ చేస్తున్నాయి. ఖరగ్పూర్ సదర్, కలియాగంజ్ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దిలీప్ ఘోష్, మహువా మోయిత్రా లోక్సభకు ఎన్నిక కావడంతో ఈ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇక కరీంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రమథనాథ్ రాయ్ ఈ ఏడాది మేలో మరణించారు. దీంతో ఈ మూడు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఉపఎన్నికల ఒప్పందంలో భాగంగా.. కరీంపూర్ నుంచి వామపక్ష అభ్యర్థిని నిలబెట్టారు. మిగతా రెండు చోట్లు కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక అధికార తృణమూల్ కాంగ్రెస్ మూడు చోట్ల పోటీ చేస్తోంది. ఈ మూడు స్థానాలు ఆపార్టీ చాలా కీలకమైన సీట్లు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 18, తృణమూల్ కు 22 ఎంపీ సీట్లు వచ్చాయి.