రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వివిధ మీటింగ్ ల్లోనూ తమ పార్టీకి ఓటు వేయకున్నా, ప్రత్యర్థి పార్టీ అయినా అర్హత ఉంటే ఇంటి స్థలం ఇచ్చి తీరాల్సిందే, కులం, మతం, పార్టీ ఏమి చూడవద్దు, అర్హత ఉంటే లబ్ధిదారుల జాబితాలో పేరు ఉండి తీరాలి లేకుంటే అధికారులను నిలదీయాల్సి వస్తుందని కూడా సీఎం జగన్ పేర్కొంటూ వస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో సీఎం జగన్ ఆశయాన్ని తూట్లు పొడిచే విధంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. అధికారులు, నేతల తప్పిదాల వల్ల వైఎస్ జగన్ ప్రభుత్వం ఇరుకున పడే పరిస్థితి వస్తున్నది. ప్రతి పక్షాలకు ఇవి అస్త్రాలుగా మారుతున్నాయి.
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం వద్ద ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీకి సేకరించిన ‘ఆవ’ భూముల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజమండ్రి అర్బన్, రూరల్ ప్రాంతాలకు చెందిన వేలాది మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు గానూ ప్రభుత్వం 500లకు పైగా ఎకరాల భూమి సేకరించింది. అయితే ఆ భూములు నివాస యోగ్యానికి అనుకూలమా కాదా అన్న విషయాలను అధికారులు పరిశీలించకుండా రైతుల నుండి భూములను కొనుగోలు చేశారు. కొందరు రైతులకు ఎకరాకు 45లక్షల రూపాయలు చొప్పున పరిహారం కూడా చెల్లించారు. ఈ భూ సేకరణ, ఇళ్ల పట్టాల పంపిణీపై కోరుకొండ మండలానికి చెందిన ఒకరు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే కూడా ఇచ్చింది. ఇది ఇలా ఉండగానే నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆవ భూములు ముంపునకు గురి అయ్యాయి. ఇళ్ల పట్టాల కోసం సేకరించిన భూముల్లో నాలుగు అడుగుల నుండి పది అడుగుల మేర వరద నీరు నిలిచింది. దీనితో అక్కడి ప్రభుత్వ అధికారులు చేసిన తప్పిదం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసి పోయింది.
ఈ ఆవ భూముల వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. ప్రభుత్వానికి కళ్ళు ఉంటే తక్షణం అక్కడి అధికారులను సస్పెండ్ చేయాలన్నారు సోము వీర్రాజు. జల వనరుల శాఖ అధికారులు ఆవ భూములు నివాసయోగ్యం కాదని హెచ్చరించినా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ లతో అనుమతులు తీసుకోవడం చాలా దారుణమని వీర్రాజు పేర్కొన్నారు. ఆవ భూముల్లో ఇళ్ల పట్టాల పంపిణీని వెంటనే రద్దు చేసి, రైతులకు ఇచ్చిన డబ్బులను వెనక్కు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగానూ ఇళ్ల స్థలాల పంపిణీ కోసం సేకరించిన భూముల కొనుగోళ్ల పై విజిలెన్స్ కమిటీతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు సోము వీర్రాజు. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన డిమాండ్ లపై సిఎం జగన్, ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?