(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఏపీ బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ కీలక నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు వైసీపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజు, గోకరాజు సోదరులు నరసింహరాజు, రామరాజులు.. సోమవారం సాయంత్రం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు.
ఏపీ రాజకీయాల్లో గోకరాజు గంగరాజు తొలినుంచి బీజేపీకి సన్నిహితంగా ఉంటూ.. కీలక నేతగా ఎదిగారు. ఆయనకు బీజేపీ అగ్రనేతలతో పాటు రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో గోకరాజు గంగరాజు బీజేపీ తరఫున నర్సాపురం నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. అయితే ఇటీవల జరిగిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. అమిత్ షా ఎప్పుడు ఏపీ పర్యటనకు వచ్చినా కృష్ణా కరకట్టపై ఉన్న గోకరాజు అతిథి గృహంలోనే దిగేవారు. ఇప్పటి వరకు టీడీపీ, వైసీపీ నేతలు తమతో టచ్లో ఉన్నారంటూ లీకులు వదులుతున్న బీజేపీకి.. గోకరాజు వ్యవహారంతో షాక్ కి గురి చేసింది. బీజేపీలో చేరేందుకు నేతలు క్యూ కడతారని చెబుతున్న తరుణంలో గోకరాజు కుటుంబ బీజేపీని వీడటం చర్చనీయాంశమైంది. బీజేపీ మాజీ ఎంపీ కుటుంబం వైసీపీలో చేరనున్న నేపథ్యంలో బీజేపీకి సీఎం జగన్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని వైసీపీ నేతలు అంటున్నారు.