బెంగళూరు: కర్ణాటక ఉపఎన్నికల ఫలితాల అధికార బీజేపీకి చెందిన మెజార్టీ అభ్యర్థులు ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు.11 చోట్ల బీజేపీ, రెండు చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఎన్నికల ఫలితాల్లో తేడావస్తే ప్రభుత్వమే పడిపోయే ప్రమాదం ఉండడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి కర్ణాటకపైనే ఉంది.
పార్టీ ఫిరాయించిన 15 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేయడంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. డిసెంబర్ ఐదో తేదీన రాష్ట్రంలోని 15 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, బీజేపీలు అన్ని స్థానాలకు పోటీ చేయగా జేడీఎస్ 12 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించింది. ఎన్నికల్లో 66.25 శాతం పోలింగ్ నమోదైంది. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలపై న్యాయస్థానాల్లో కేసులు ఉండటంతో ఆ రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగలేదు. దీంతో అసెంబ్లీలో మిగిలిన 222కు గాను మ్యాజిక్ నెంబర్ 112. ప్రస్తుతం బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇవాళ వెల్లడయ్యే ఉప ఎన్నికల ఫలితాల్లో కనీసం ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిస్తేనే బీజేపీకి మెజార్టీ ఉంటుంది. లేదంటే ఎడియూరప్ప సర్కారు మైనార్టీలో పడిపోతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 66, జేడీఎస్కు 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటివరకు ప్రకటించిన అన్ని సర్వేలు బీజేపీకి పదికిపైగా దక్కుతాయని తేల్చడంతో సీఎం యడియూరప్ప మంత్రివర్గ విస్తరణపై సమాలోచనలు చేసినట్టు సమాచారం.
ఫలితాలకోసం రాష్ట్రంలోని మూడు పార్టీల ముఖ్యనేతలే కాకుండా కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు సైతం ఎదురుచూస్తున్నారు. బీజేపీ జాతీయ నేతలకు మహారాష్ట్రలో ఎదురుదెబ్బ తగలడంతో కర్ణాటకలో అటువంటి పరిణామాలు ఎదురు కాకుండా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. ఒకవేళ అనుకున్నన్ని స్థానాలు దక్కకపోతే మరోసారి ఆపరేషన్ కమల జరిగే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
14 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ సభ్యుల రాజీనామాలతో ఈ ఏడాది జూలైలో కాంగ్రెస్- జేడీఎస్ సర్కారు కూలిపోయింది. ఆ వెంటనే రాజీనామాలు చేసిన సభ్యులను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. దీంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి.