దేశంలో మొదటి బుల్లెట్ రైలు నడిపిన ఖ్యాతి సంపాదించాలని ఉవ్విళ్లూరుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సొంత పార్టీ నేత నుంచే ఛీత్కారం ఎదురయింది. మోదీజీ, బుల్లెట్ రైలు సంగతి మర్చిపొండి. ఇప్పటికే నడుస్తున్న రైళ్లు సవ్యంగా నడిచేట్లు చూడండి అంటూ ఓ పంజాబ్ నేత పంపిన వీడియో సందేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
లక్ష్మీకాంత చావ్లా గతంలో పంజాబ్ ప్రభుత్వంలో ఆరోగ్యం, సాంఘిక సంక్షేమం శాఖలు నిర్వహించారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారని ఆమెకు పేరు. ఈ నెల 22న ఆమె సరయూ-యమున రైలులో ప్రయాణించారు. రైలు పది గంటలు ఆలస్యంగా నడిచింది. తాను అన్ని రైల్వే హెల్ప్ లైన్లకూ ఫోన్ చేశాననీ, ఒక్కరు కూడా సమాచారం ఇవ్వలేదనీ ఆమె పేర్కొన్నారు. ఆ రైలులో కూర్చుని ఆమె తన గోడు వీడియోకు ఎక్కించారు.
‘మోదీజీ, బుల్లెట్ రైలు సంగతి మరచిపొండి. నడుస్తున్న రైళ్లను సవ్యంగా నడపండి. గత 24 గంటలుగా మా తిప్పలు దేవుడికెరుక. రైలు ఎప్పటికి చేరుతుందో తెలియదు. సమాచారం ఇచ్చేవారు లేరు. ప్రయాణీకుల తిండితిప్పలూ చూసేవారు లేరు. మాలాంటి సాధారణ ప్రయాణీకుల గోడు పట్టించుకోండి’ అని లక్ష్మీ చావ్లా పేర్కొన్నారు.
రైల్వే మంత్రి పీయూష్ గోయల్ను ఉద్దేశించి కూడా ఆ వీడియోలో ఆమె మాట్లాడారు. ‘శతాబ్ది, రాజధాని రైళ్లు ధనికుల కోసం. పేదలూ, కార్మికులూ, సైనికుల సంగతి ఏమిటి? సాధారణ ప్రయాణీకులు విశ్రమించడానికి చోటు కూడా కనబడదు. చలిలో బయట పడుకోవాల్సిందే. మోదీజీ, ప్రజలు విసిగిపోయారు. అచ్ఛేదిన్ ఎవరికి వచ్చాయో తెలియదు. సగటు ప్రజలకైతే కాదు’, అని ఆమె వ్యాఖ్యానించారు.
వీడియో చూడాలంటే కింద క్లిక్ చేయండి.