అమరావతి: బిజెపిలో చేరితే కేసుల నుండి విముక్తి కలుగుతుందనే భ్రమలు ఎవరూ పెట్టుకోవద్దని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అన్నారు.
సార్వత్రిక ఎన్నికల అనంతరం ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాక దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని పలు పార్టీల నేతలు రెండవ సారి కేంద్రంలో అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బిజెపిలో చేరుతున్న విషయం తెలిసిందే. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రాకు చెందిన పలు పార్టీల నేతలు ఇప్పటికే కాషాయ కండువాలు కప్పుకోగా మరి కొందరు త్వరలో కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
ఏపికి చెందిన టిడిపి రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్ లాంటి నేతలు బిజెపిలో చేరిన సమయంలో రాష్ట్రంలోని పలువురు వైసిపి నేతలు వారిపై ఆరోపణలు చేశారు. ఇడి, ఐటి కేసుల నుండి తప్పించుకునేందుకే వారు బిజెపిలో చేరారంటూ విమర్శించారు.
ఇదిలా ఉండగా బిజెపి నేత మురళీధరరావు పార్టీలో చేరికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టిడిపి నుండి చాలా మంది నేతలు బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టిడిపికి ఇక భవిష్యత్తులో కూడా గెలిచే అవకాశాలు లేవని వ్యాఖ్యానించారు. ఇప్పటికే చాలా మంది టిడిపి నేతలు తమ పార్టీలో చేరేందుకు చర్చలు జరిపారని మురళీధరరావు అన్నారు. తెలంగాణలో టిఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బిజెపియేననీ, ఏపిలో కూడా ఇదే పరిస్థితి వస్తుందనీ మురళీధరరావు పేర్కొన్నారు.
బిజెపిలో చేరితే కేసుల నుండి విముక్తి కలుగుతుందనే భ్రమలు ఎవ్వరూ పెట్టుకోవద్దనీ, అలాంటి ఆశతో పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తే అది వృధా ప్రయాసే అవుతుందనీ మురళీధరరావు అన్నారు. కేసులకు సంబంధించి చట్టం తన పని తాను చేసుకుపోతుందనీ, ఐటి దాడులకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదనీ ఆయన చెప్పుకొచ్చారు.