గుంటూరు: మోదీ నూతన విధానాల పట్ల ప్రజలు ఆశాభావంతో ఉన్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. గుంటూరులో బిజెపి రాష్ట్ర పదాధికారుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, బిజెపి నేత హరిబాబు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో పార్టీ బలోపేతంపై, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సభ్యత్వ నమోదుపై చర్చించారు.
ఈ సందర్భంగా రామ్ మాధవ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో దేశంలో 23 కోట్ల మంది బిజెపికి ఓట్లు వేశారని రామ్ మాధవ్ అన్నారు. 16 కోట్ల మంది పార్టీ సభ్యత్వం లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని రామ్ మాధవ్ పేర్కొన్నారు. ఎనిమిది లక్షల బూత్ కమిటీలు కలిగిన ఏకైక పార్టీ బిజెపి అని రామ్ మాధవ్ అన్నారు. బిజెపికి అధికారం పరమావధి కాదనీ, అధికారం ప్రజల కోసమే అనేది బిజెపి భావన అని రామ్ మాధవ్ పేర్కొన్నారు. బిజెపిలో కులాలు, గ్రూపు రాజకీయాలు ఉండవని రామ్ మాధవ్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తామని తాము చెప్పడం లేదనీ, రాహుల్ గాంధీనే ఆ పని చేస్తున్నారని రామ్ మాధవ్ అన్నారు. నూతన రాజకీయ సంస్కృతి తీసుకురావడమే బిజెపి లక్ష్యమని రామ్ మాధవ్ పేర్కొన్నారు. సామాన్యులు బిజెపి వైపు ఆకర్షితులవుతున్నారని మాధవ్ అన్నారు. ఏపీలో అలాంటి పరిస్థితి ప్రస్తుతం ఉందని ఆయన తెలిపారు. ఈ సానుకూల పరిణామాలను పార్టీ శ్రేణులు సద్వినియోగం చేసుకోవాలని మాధవ్ సూచించారు.
ఏపీలో బిజెపికి నిరుత్సాహకరమైన ఫలితాలు వచ్చాయనీ, ఈ ఓటమిని ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో పార్టీని తెలంగాణలో మాదిరిగా బలోపేతం చేయాలని మాధవ్ సూచించారు. టిడిపి పట్ల ప్రజల్లో భ్రమలు తొలిగిపోయాయని మాధవ్ అన్నారు. ఇక తానా సభలోనే టిడిపి మిగిలే అవకాశం ఉందని మాధవ్ ఎద్దేవా చేశారు. టిడిపి పాలనలో వందల కోట్ల అవినీతి జరిగిందని మాధవ్ ఆరోపించారు. రాష్ట్రంలో బలమైన శక్తిగా బిజెపి ఎదగాలనీ, 2024 నాటికి బిజెపి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని మాధవ్ పిలుపునిచ్చారు. ఏపీ అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని మాధవ్ స్పష్టం చేశారు.
సభ్యత్వ నమోదు ప్రక్రియ ఆగస్టు 11 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుందని మాధవ్ తెలిపారు. ఈ నెల 15 నుంచి 22 వరకు సభ్యత్వ నమోదుపై శిక్షణ ఉంటుందని మాధవ్ తెలిపారు. వారం రోజుల పాటు నేతలంతా సభ్యత్వ నమోదులో పాల్గొనాలని మాధవ్ సూచించారు. ప్రతి ఒక్కరూ కనీసం 25 మందిని సభ్యులుగా చేర్పించాలనీ, అప్పుడే వారికి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని రాంమాధవ్ తెలిపారు.