అమరావతి: జియన్ రావు కమిటీ నివేదిక చెత్త బుట్టలో వేయడానికి తప్ప ఎందుకు పనిరాదని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. దీన్ని జియన్ రావు కమిటీ అనే దాని కంటే జగన్మోహన్ రెడ్డి కమిటీ అంటే బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నివేదిక ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని అన్నారు. రాష్ట్రంలో ఎం జరుగుంతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. టిడిపిని గందరగోళంలో నెట్టడానికి జగన్ ప్రకటన ఉంది తప్ప ప్రజలకు ఉపయోగపడేలా లేదని ఆయన అన్నారు. నాడు హైకోర్టును కర్నూల్లో పెట్టమంటే చంద్రబాబు వినలేదని విష్ణువర్థన్ రెడ్డి చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి ,చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ను తమ జాగీర్ అనుకొని రాష్ట్రాన్ని ఫుట్ బాల్లా అడ్డుకుంటున్నారని విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని బిజెపి గతంలోనే చెప్పిందని గుర్తు చేస్తూ దానికి కట్టుబడి ఉన్నామన్నారు.అమరావతిలోనే సీడెడ్ కాపిటల్ ఉండాలి, మిగిలిన ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాలనీ ఆయన అన్నారు. అమరవతిలోనే సచివాలయం, అసెంబ్లీ ఉండాలి అదే బిజెపి స్పష్టమైన విధాన నిర్ణయమని విష్ణువర్థన్ రెడ్డి స్పష్టం చేశారు.
జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయాలు తీసుకోవడానికి కారణం చంద్రబాబు నాయుడేనని విష్ణు వర్థనరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని ముంచేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆయన విమర్శించారు. నాలుగు వేల ఎకరాలు భు కుంభకోణం జరిగింది అని చెపుతున్న వైసిపి నేతలు ఎందుకు నిరూపించలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు.‘రైతులు ఇష్టంగానో, కష్టంగానో తమ పొలాలు త్యాగం చేసి రాజధానికి ఇచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అధిక ఎమ్మెల్యేలు మీరే గెలిచారు, మీకు పట్టం కడితే అమరావతి రైతులను మోసం చేస్తారా?’ అని విష్ణువర్థన్ రెడ్డి ప్రశ్నించారు. రాయలసీమలో పంటలు పండక రైతులు ఏడుస్తుంటే, అమరావతి రైతులను మరోలా ఏడిపిస్తున్నారని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి అభివృద్ధి వికేంద్రీకరిస్తారా, లేక పరిపాలన వికేంద్రీకరిస్తారా అని ప్రశ్నించారు. రాజాకీయంగా టిడిపిని ఇబ్బంది పెట్టడానికే పరిపాలన వికేంద్రీకరణ అని వైసిపి కొత్త ఎత్తుగడ వేసిందని ఆయన విమర్శించారు. పరిపాలన వికేంద్రీకరణ చేసినంత మాత్రాన ప్రాంతాలు అభివృద్ధి చెందవని ఆయన అన్నారు.కర్నూలుకు హైకోర్ట్ రావడం వలన కొత్తగా వచ్చేది ఏమీ ఉండదనీ, మహా అయితే నాలుగు జిరాక్స్ సెంటర్లు, నాలుగు న్యాయవాదుల భవనాలు తప్ప ఇంకేమీ ఉండదనీ ఆయన వ్యాఖ్యానించారు.హైకోర్ట్ ఒక ప్రాంతంలో, బెంచ్ ఒక ప్రాంతంలో ఉండాలని ఎవరైనా చెప్తారు, దానికి జియన్ రావు కమిటీ అవసరంలేదని వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖలో, మంత్రులు అమరావతిలో ఉంటే వారిని విమానాల్లో తరలిస్తారా అని ప్రశ్నించారు.పరిపాలన వికేంద్రీకరణ చేయడం వల్ల అభివృద్ధి జరగదనీ, పరిశ్రమల స్థాపనతోనే అభివృద్ధి జరుగుతుందనీ విష్ణువర్థన్ రెడ్డి తెలిపారు.