(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ఏపి మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న బిజెపి నేతలు ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని వెల్లడిస్తున్నారు. పార్టీ పరంగా వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని కావున కేంద్రం జోక్యం చేసుకోదని చెప్పుకొచ్చారు.
ఢిల్లీలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావులు మాట్లాడారు.
రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు బిజెపి, జనసేన ఉమ్మడి ఉద్యమ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వారు పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయం ప్రజావ్యతిరేక విధానమని కన్నా అన్నారు. అధికారంలోకి వస్తే మూడు రాజధానులు చేస్తామని కూడా వైసిపి చెప్పలేదన్నారు. చంద్రబాబు మీద విసిగిపోయిన ప్రజలు వైసిపికి అధికారం అప్పగిస్తే అధికారంలోకి వచ్చినప్పటి నుండి జగన్ ప్రజా వ్యతిరేక విధానాలతో, కక్షసాధింపుతో పాలన సాగిస్తుందని విమర్శించారు. ప్రజల నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు గుణ పాఠం చెప్పిన మాదిరిగానే జగన్కు రాబోయే ఎన్నికల్లో ప్రజలు కసి తీర్చుకుంటారని కన్నా అన్నారు. జగన్ది పిచ్చి తుగ్లక్ పాలననీ, పిచ్చి తుగ్లక్ను మించిపోయారనీ ఆయన విమర్శించారు. గతంలో అమరావతి పేరుతో చంద్రబాబు భూ దాహంతో ఎలా దందాలు చేశారో.. ఇప్పుడు జగన్ కూడా విశాఖపట్నంలో భూ దాహం తీర్చుకోవాలని చూస్తున్నారని కన్నా ఆరోపించారు.
విశాఖలో భూముల దోపీడీకే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాజధానిని మార్చే హక్కు జగన్కు లేదన్నది పార్టీ పరంగా తమ అభిప్రాయమని అన్నారు. అమరావతిని మార్చడానికి జగన్ అనేక కుంటిసాకులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఒకసారి ముంపు ప్రాంతమనీ, మరోసారి అటవీ ప్రాంతమనీ, ఇంకో సారి ఎడారనీ, ఆ తర్వాత లక్ష కోట్లు వ్యయమవుతుందనీ ఇలా జగన్ ప్రభుత్వం పూటకోమాట చెబుతూ వచ్చిందని విమర్శించారు. నిధుల లేమి కారణంగా చూపి లక్ష కోట్లు అమరావతిపై ఎలా వెచ్చించగలమని చెబుతున్న జగన్ ఇప్పుడు విశాఖకు లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలు ఎలా ప్రకటిస్తున్నారని కన్నా నిలదీశారు. రాజధాని అంశం ఒక్క 29 గ్రామాలకో, రెండు జిల్లాలకో సంబంధించిన సమస్య కానే కాదని అన్నారు. ఇది అయిదు కోట్ల మంది జనాభాకు సంబంధించిన సమస్యని తెలిపారు. రైతులు యావత్ రాష్ట్ర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకునే భూములు ఇచ్చారనీ, ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కూడా అంగీకరించారనీ, ఇప్పుడు వారికి అన్యాయం చేస్తూ, నియంతగా పాలిస్తున్నారనీ కన్నా దుయ్యబట్టారు. కేంద్రం అనుమతితో నిర్ణయాలు తీసుకుంటున్నామంటూ వైసిపి తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదన్నారు.
రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావు మాట్లాడుతూ మూడు రాజధానుల నిర్ణయం బోగస్ విధానమని విమర్శించారు. అసెంబ్లీ ఉన్నంత మాత్రాన అమరావతి రాజధాని కాదని అన్నారు. రాయలసీమలో హైకోర్టు పెట్టాలని తాము ఎప్పుడో కోరామని పేర్కొన్నారు. న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకే అమరావతిని కూడా రాజధాని అంటున్నారా అని ప్రశ్నించారు. అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు జగన్ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని విమర్శించారు. కేంద్రం అనుమతితోనే అంతా జరుగుతోందని వస్తున్న కథనాలు కల్పితాలేనని అన్నారు. తమ చేతగాని తనాన్ని టిడిపి కేంద్రంపై రుద్దాలని చూస్తోందా అని ప్రశ్నించారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించడం ఏమిటి, ఇది కుటుంబ విధానం కాదు, రాజ్యాంగ వ్యవస్థ అని జివిఎల్ అన్నారు. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్పై ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నా ఇప్పటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు జనసేనతో కలిసి కార్యాచరణ ప్రకటిస్తామని జివిఎల్ తెలిపారు.