అమరావతి: బిజెపి జాతీయ, రాష్ట్ర నాయకులు పలువురు శనివారం మంగళగిరి హాయ్ల్యాండ్లో రహస్య సమావేశం నిర్వహించారు. కొద్ది రోజుల్లో టిడిపి నుండి భారీగా చేరికలు ఉంటాయని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ రహస్య సమావేశం ఏర్పాటు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశానికి మీడియాను ఆహ్వానించలేదు. సమావేశంలో కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ లియోనల్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు పాల్గొన్నట్లు సమాచారం.
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో బిజెపిని రాష్ట్రంలో బలోపేతం చేసే ప్రయత్నాలను ఆ పార్టీ ప్రారంభించింది. ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను, ఇద్దరు టిడిపి మాజీ ఎమ్మెల్యేలను బిజెపిలో చేర్చుకొన్నది. జనసేన పార్టీ నుండి ఒక మాజీ మంత్రిని పార్టీలో చేర్చుకొన్నది. టిడిపిలో నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపిలతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను సైతం ఆకర్షించేందుకు బిజెపి పావులు కదుపుతోంది. బిజెపి నుండి ఆహ్వానిస్తున్నారంటూ కొందరు నేతలు బాహాటంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బిజెపి నేతలు హాయ్ల్యాండ్లో రహస్య భేటీ నిర్వహించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది.