(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణ బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్పై రౌడీ షీట్ నమోదైంది. మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్స్ జాబితాలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు చేర్చారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆ జాబితాలో 24వ పేరులో ఎమ్మెల్యే రాజా సింగ్ను పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్లిన కొంతమంది బీజేపీ కార్యకర్తలు, ఈ లిస్ట్ను ఫోటో తీసి రాజా సింగ్కు పంపించడంలో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో పోలీసుల తీరుపై రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ తన పేరును రౌడీ షీటర్స్ జాబితాలో కొనసాగించడంపై మండిపడ్డారు. ఇదే విషయమై బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటికీ తెలంగాణ పోలీసుల దృష్టిలో రౌడీ షీటర్గానే ఉండడం బాధాకరంగా ఉంది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారిపై, ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నవారిపై గతంలో రౌడీ షీట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు వారి పేర్లు ఆ లిస్ట్ లో పెట్టగలరా? దీనికి హోం మంత్రి లేదా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి’ అని రాజా సింగ్ ప్రశ్నించారు.
తెలంగాణ పోలీసులు తమ నిజస్వరూపాన్ని బయటపెట్టారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పార్టీకి గులాంగిరి చేసే నాటి కమిషనర్ ఏకే ఖాన్ తనపై రౌడీషీట్ ఓపెన్ చేశారని రాజాసింగ్ చెప్పారు. ప్రతి నెల రౌడీషీట్ల లిస్ట్ను ఆయా పీఎస్లో పెడతాడని, మంగళ్ హాట్ పీఎస్ రౌడీ షీట్ లిస్ట్లో తన పేరు ఉందని ఇప్పుడే తెలిసిందన్నారు. తనపై కుట్రతోనే రౌడీషీట్ నమోదుచేశారని ఆరోపించారు. దీనిపై డీజీపీ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో పోలీసులు నీతీనిజాయితీగా పనిచేసేవారని, ఇప్పుడు వారంతా టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల చేతిలో కీలుబొమ్మలుగా మారారని ఆరోపించారు. ఎంఐఎం పార్టీ ఒత్తిడితోనే తనపై రౌడీషీట్ నమోదు చేశారని ధ్వజమెత్తారు. అంబర్పేట్లో ఎంఐఎం నేతలు అక్రమంగా మసీద్ను కడుతుంటే తానొక్కడినే వెళ్లి అడ్డుకున్నానని, అందుకే తనపట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు, మంత్రులపై రౌడీషీట్లు లేవా? అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని తమ పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లతానని రాజాసింగ్ చెప్పారు.