(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యంగ బద్ధంగానే వ్యవహరిస్తుందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహరావు అన్నారు.
శాసనమండలి రద్దు సిఎం జగన్ అనుకున్నంత సులువు కాదనీ, స్టాండింగ్ కమిటీ వద్ద శాసనమండలిల ఏర్పాటుకై పది రాష్ట్రాలకు చెందిన వినతులు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయనీ టిడిపి ఎంపి కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలి రద్దు తీర్మానం పంపిన వెంటనే కేంద్రం ఆమోదించే అవకాశం లేదనీ టిడిపి ఎంపిలు చెబుతుండగా, బిజెపి ఎంపి జివిఎల్ వారి మాటలకు విరుద్ధంగా వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది.
శాసనమండలిని రద్దు చేస్తూ ఏపి అసెంబ్లీ చేసిన తీర్మానానికి కేంద్రం అడ్డు చెప్పే అవకాశం లేదని జివిఎల్ అన్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూచనలు మాత్రమే చేస్తుందనీ, ఆ సూచనలపై అంతిమ నిర్ణయం పార్లమెంట్ తీసుకుంటుందనీ ఆయన తెలిపారు. మండలి రద్దుపై ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసే ఆలోచన కేంద్రానికి ఉండదని జివిఎల్ అన్నారు.