పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీపై పైచేయి సాధించేందుకు బిెజెపి జై శ్రీరాం నినాదాన్ని ఆయుధంగా వాడుకుంటోంది
(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బిజెపి ముప్పేట దాడి చేస్తోంది. తాజాగా ఆ పార్టీ ఎంపి సాక్షి మహరాజ్ మమతాదీని హిరణ్యకశ్యపుడితో పోల్చారు. హిందూ పురాణ గాధల ప్రకారం అసుర రాజు హిరణ్యకశ్యపుడు హరి ద్వేషి. తన కుమారుడైన ప్రహ్లాదుడు హరి భక్తుడు కావడంతో అతనిని కారాగారంలో ఉంచుతాడు.
జై శ్రీరాం అన్నందుకు హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని జైలుకు పంపాడనీ, ఇప్పుడు మమతా బెనర్జీ కూడా తన రాష్ట్రంలో జై శ్రీరాం అన్నవారిని జైలులో పెడుతున్నారనీ సాక్షి మహరాజ్ వ్యాఖ్యానించినట్లు ఎఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ఇది చూస్తుంటే మమతా బెనర్జీ కూడా ఆ రాక్షసరాజు వంశం నుంచే వచ్చినట్లు కనబడుతోందని ఆయన అన్నారు. విన్నవారు నివ్వెరపోయేట్లు ప్రకటనలు చేయడం సాక్షి మహరాజ్కు అలవాటే. లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్బంగా ఆయన తనకు వోటు వేయనివారికి దుష్కర్మ ప్రాప్తిస్తుందని వ్యాఖ్యానించారు. సొంతపార్టీని కూడా బెదిరించేందుకు ఆయన వెనుకాడరు. ఢిల్లీలోని జుమా మసీదును ఒక ఆలయంపై నిర్మిచారు కాబట్టి దాన్ని కూల్చివేయాలని గత ఏడాది ఆయన డిమాండ్ చేశారు.