(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల వ్యవహారం తెలంగాణకూ సోకింది. తెలంగాణలోనూ మూడు చోట్ల రాజధానులు ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ జరపాలని కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు అదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు. హైదరాబాద్ కేంద్రంగానే మొత్తం అభివృద్ధి జరగడం అంత శ్రేయస్కరం కాదని అన్నారు. తెలంగాణలో మూడు రాజధానులు ఏర్పాటు చేసి, అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. హైదరాబాద్, అదిలాబాద్, వరంగల్.. ఇలా మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని బాపూరావు సూచించారు. అదిలాబాద్ వంటి పట్టణాలు హైదరాబాద్కు సూదూరంలో వున్నాయని, దాంతో అక్కడ అభివృద్ధి అంతంత మాత్రంగానే వుందని తెలిపారు. అదిలాబాద్లో శాసనసభ, శాసనమండలి ఏర్పాటు చేసి, ఏడాదిలో రెండుసార్లు ఆదిలాబాద్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కోరారు. దీంతో అదిలాబాద్ బాగా అభివృద్ధి అవుతుందని అభిప్రాయపడ్డారు. ఆదిలాబాద్లో అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్ను కలుస్తామని బాపూరావు వెల్లడించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ మూడు రాజధానుల అంశం ప్రకటించిన నాటి నుంచి దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. విశాఖ, కర్నూలు, అమరావతిలలో మూడు ప్రధాన విభాగాలను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రకటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. సీఎం జగన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. రాజధాని ప్రాంత రైతులు జగన్ నిర్ణయంపై తీవ్ర ఆందోళన చేస్తున్నారు. విశాఖ, కర్నూలు ప్రాంత వాసులు మాత్రం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. మరోవైపు మూడు రాజధానుల అంశం ప్రాక్టికల్గా సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.