న్యూఢిల్లీ: రఫేల్ స్కాం కేసులో మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు క్రిమినల్ కోర్టుధిక్కారం కిందకు వస్తాయని పేర్కొంటూ, ఆయనపై చర్య తీసుకోవాల్సిందిగా బిజెపి ఎంపి మీనాక్షి లేఖి శుక్రవారం అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్ధించారు.
చౌకీదార్ చోర్ హై అన్న మాటలను రాహుల్ సుప్రీంకోర్టుకు ఆపాదించారని లేఖి పేర్కొన్నారు. లేఖి తరపున సుప్రీంకోర్టులో హాజరయిన మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, సుప్రీంకోర్టు తమ ఆదేశాలలో చౌకీదార్ చోర్ హై అన్నట్లు రాహుల్ వ్యాఖ్యానించారని పేర్కొన్నారు.
ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వలోని ధర్మాసనం సోమవారం లేఖి పిటిషన్పై వాదనలు వింటుంది.
రఫేల్ ఒప్పందం వివాదానికి సంబంధించి దాఖలయిన రివ్యూ పిటిషన్ విచారణలో ద హిందూ పత్రిక ప్రచురించిన రహస్య పత్రాలను సాక్ష్యం కింద పరిగణించవచ్చునని గత బుధవారం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ రహస్యపత్రాలను దొంగిలించి ప్రచురించారు కాబట్టి వాటిని సాక్ష్యం కింద తీసుకోవడానికి వీలు లేదన్న ప్రభుత్వ వాదనను కోర్టు తోసిపుచ్చింది.
ఆ తీర్పు వెలువడిన అనంతరం రాహుల్ గాంధీ స్పందిస్తూ, చౌకీదార్ దొంగతనం చేశాడని దేశం అంతా అంటున్నది. సుప్రీంకోర్టు న్యాయం చెప్పింది కాబట్టి ఇది పండగ చేసుకునే రోజు అన్నారు.