న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యక్తిగత కక్షసాధింపు చర్యలను పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించాలని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి హితవు పలికారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే జగన్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. వ్యక్తిగత మత విశ్వాసాలు ఉంటే పూజ గదికే పరిమితం చేయాలనీ, ప్రభుత్వంలో చొప్పించ కూడదనీ అన్నారు. జెరూసలేంకు ఆర్థిక సాయం చేసే ప్రభుత్వం బద్రీనాధ్కో, కేధార్నాధ్కో వెళ్లడానికి హిందువులు సాయం చేయమంటే ఏం చేస్తారని సుజనచౌదరి ప్రశ్నించారు. పన్నుల రూపంలో ప్రజల నుండి వచ్చిన సొమ్మును ఇష్టానుసారం మతాల వారీగా పంచడం రాజ్యాంగ విరుద్దమని ఆయన అన్నారు. అధ్యాత్మిక టూరిజాన్ని అభివృద్ధి చేసి వచ్చిన రాబడితో ప్రభుత్వం డబ్బులు పంచిపెట్టుకుంటే అభ్యంతరం లేదని అన్నారు. ప్రజల నుండి పన్నులుగా వచ్చిన సొమ్మును నచ్చిన మతాలకు ఇవ్వడంపైనే అభ్యంతరమని పేర్కొన్నారు. ఈ విషయాలు అన్నీ తాను కేంద్రం పెద్దలతో సంప్రదించే మాట్లాడుతున్నానని సుజనా వివరించారు.
ఇంగ్లీషు మీడియం నిర్ణయం తీసుకునే ముందు ఎవరినైనా సంప్రదించారా అని సుజనా ప్రశ్నించారు. ఉపాధ్యాయులను సిద్ధం చేయకుండా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం సరికాదని అన్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తే విద్యార్థులు అటూ ఇటూ కాకుండా పోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై విద్యావేత్తలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని సుజనా అభిప్రాయపడ్డారు. మైసూర్లో ఉన్న తెలుగు అధ్యయన కేంద్రం ఏపి రావడానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎంతో కృషి చేశారని గుర్తు చేస్తూ రాజ్యంగ పదవిలో ఉన్న వ్యక్తిపైనా చులకనగా మాట్లాడటం అక్షేపణీయమన్నారు. పిల్లలు సృజనాత్మకంగా పెరగాలంటే మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని చెప్పేందుకు శాస్త్రీయ కారణాలున్నాయని సుజనా అన్నారు. 6400 హైస్కూళ్లు ఉంటే కేవలం 32శాతం మంది మాత్రమే ఇంగ్లీషు మీడియంలో చేరుతున్నారని ఆయన చెప్పారు. సగానికి పైగా హైస్కూళ్లలో తెలుగు మీడియంలోనే చేరుతున్నారని గణాంకాలు చెబుతున్నాయన్నారు
ఆరు నెలలైనా పరిపాలనపై జగన్ దృష్టి పెట్టలేదని సుజనా విమర్శించారు. రాజు మారగానే రాజధాని మార్చడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో రాజధాని మాత్రమే కాదు అన్ని ప్రాజెక్టులను నిలిపివేశారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుండి నిధులు కూడా రావని సుజనా చెప్పారు. ఇప్పటికైనా ఎన్నికల కోణం నుండి బయటకు వచ్చి పాలనపై దృష్టి పెట్టాలని అన్నారు.
‘25మంది ఎంపిలను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. ఇప్పుడేమైంది, వైసిపికి 22 మంది ఎంపిలు ఉండి ఏం లాభం, వారు ఎటు మాట్లాడినా ఉలిక్కిపడుతున్నారు’ అని సుజనా వ్యాఖ్యానించారు. నగేరా పథకాలకు కేంద్రం ఇచ్చిన సొమ్ములను దారి మళ్లిస్తున్నారనీ, ఆ పథకాలపై ఆధారపడే పేదల కడుపు కొట్టడం సరికాదనీ అన్నారు. కృష్ణారివర్ బోర్డును అమరావతికి ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. జగన్ నిర్ణయాలు చూసి జనం నవ్వుకుంటున్నారని సుజనా వ్యాఖ్యానించారు.
ఏపిలో భారతీయ జనతా పార్టీ సొంతంగా ఎదగాలనే అంశంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాతో చర్చించామని సుజనా చెప్పారు.