న్యూఢిల్లీ: మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్తే… కేంద్రం చూస్తూ ఊరుకోదని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంలు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా అని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎవరూ ఊరుకోరని హెచ్చరించారు. ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం మంచిపద్ధతి కాదన్నారు. అధికారంలో ఎవరుంటే వారికి ఉద్యోగులు డబ్బా కొట్టొద్దని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధానిగా అనుకున్నప్పుడు వైసీపీ అభ్యంతరం చెప్పలేదని గుర్తుచేశారు. అమరావతికి కేంద్రం రూ.2500 కోట్లు ఇచ్చిందని తెలిపారు. ప్రజల సొమ్మును వృథా చేస్తామంటే ఊరుకునేది లేదని సుజనా స్పష్టం చేశారు. రాజధాని తరలింపు నిర్ణయాన్ని వైసీపీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 13 జిల్లాల అభివృద్ధిపై వైసీపీ దృష్టి సారించాలని సూచించారు.
అమరావతిలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం పరిశీలిస్తోందని తెలిపారు. ఎయిమ్స్, నిఫ్ట్ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చాయని తెలిపారు. హైకోర్టు, సచివాలయం, రాజ్ భవన్ వంటివి ఒకే చోట ఉండాలని విభజన చట్టం సెక్షన్ 6లో స్పష్టంగా ఉందని చెప్పారు. రాజధానిని మారిస్తే చూస్తూ ఊరుకోమని, రాష్ట్ర ప్రజల తరుపున పోరాడతామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందని సుజనా చౌదరి తెలిపారు. రాజధానిపై అధికార ప్రకటన వెలువడిన తర్వాత కేంద్రం జోక్యం చేసుకుంటుందని చెప్పారు.
ప్రభుత్వం తీసుకున్న చర్యతో వైసీపీ ప్రజాప్రతినిధులే సంతోషంగా లేరన్నారు. రాజధాని ఒక ప్రాంతానికి సంబంధించిన అంశం కాదని సుజనా అన్నారు. సీఎం పదవిలో ఎవరున్న ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చారని, చంద్రబాబుని చూసి కాదని అన్నారు. రాజధాని ఒక్క అంగుళం కూడా జరగదన్నారు. అమరావతి తరలింపు నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వస్తుందని సుజనాచౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి కోసం ప్రజా ఉద్యమమే కాదు, న్యాయపరంగానూ ముందుకెళ్తామని స్పష్టం చేశారు.
రాజధాని తరలింపుపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరగుతున్నాయని, కొందరు రైతులు ఆందోళనతో చనిపోయారన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను అందరు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. సీఆర్డీఏను తొలగించేందుకు ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాజు మారినప్పుడల్లా రాజధానిని మారుస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తే కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం ఉందన్నారు. రాజధాని తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిపెడితే మంచిదని సుజనా చౌదరి హితవు పలికారు.