(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అసోంకి చెందిన బీజేపీ నేత, రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిస్వా శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రకటించిన ఎన్ఆర్సీ జాబితాపై బీజేపీ సంతోషంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. నేడు విడుదలైన ఎన్ఆర్సీ తుది జాబితాలో సుమారు 19.06 లక్షల మందిని విదేశీయులుగా తేల్చారు. ఈ నేపథ్యంలో మంత్రి హిమంత బిస్వా శర్మ స్పందించారు. ఈ అంశమై తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. సరిహద్దు జిల్లాలో పౌరసత్వంపై రీవెరిఫికేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరుపున కోరతామన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ఎన్ఆర్సీ నెరవేర్చలేదని శర్మ అన్నారు. ఫలితంగా 19 లక్షల మంది పేర్లు నమోదు కాలేదన్నారు. అయితే వీరిలో 3.80 లక్షల మంది అప్పీలకు ఇష్టపడడం లేదని, వీరిలో కొంత మంది ఇప్పటికే మరణించారన్నారు. మిగిలిన 15 లక్షల మందిలో 5-6 లక్షల మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసదారులని హిమంత బిస్వా శర్మ చెప్పారు.