(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ: మహారాష్ట్ర పరిణామాలపై బిజిపి అధికారికంగా నోరు విప్పింది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైపై పట్టుకోసం కుట్ర పన్నారని ఎన్సిపి – కాంగ్రెస్పై బిజెపి ఆరోపణ చేసింది. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఢిల్లీలో శనివారం సాయత్రం మీడియాతో మాట్లాడారు.
ప్రజల తీర్పు బిజెపి – శివసేనకు అనుకూలంగా వచ్చిందని ప్రసాద్ అన్నారు. ప్రజాతీర్పు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ఫడ్నవీస్ గత అయిదేళ్లలో స్వచ్ఛమైన పాలన అందించారనీ, ఇప్పుడు సుస్థిరమైన ప్రభుత్వం అందిస్తారని ఆయన పేర్కొన్నారు.
శివసేన గత అయిదేళ్లలో సంకీర్ణప్రభుత్వంలో భాగస్వామిగా ఫడ్నవీస్ స్వచ్ఛమైన సుస్థిర పాలనకు ప్రజలలో వచ్చిన మంచిపేరు వల్ల లాభించిందని ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఉద్దవ్ థాక్రే నాయకత్వంలో ఆ పార్టీ బాలసాహెబ్ థాక్రే వారసత్వానికి తిలోదకాలు ఇచ్చిందని ఆయన అన్నారు. శివసేన నాయకులు ప్రధాని మోదీ పట్ల వాడిన భాష కూడా తమను చాలా బాధించిందని ప్రసాద్ పేర్కొన్నారు.
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ప్రసాద్ తోసిపుచ్చారు. తమకు బలం ఉందనీ, సభలో దానిని నిరూపించుకుంటామనీ ఆయన అన్నారు. అధికారం కోసం సిద్ధాంతాలను వదులుకున్నవారు ఛత్రపతి శివాజీ మహరాజ్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ప్రసాద్ వ్యాఖ్యానించారు.