న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితులు అట్టుడుకుతున్న వేళ ఎన్డీయే కీలక భాగస్వామ్య పక్షం అసోం గణపరిషత్(ఏజీపీ) యూటర్న్ తీసుకుంది. తొలుత పార్లమెంటులో మద్దతు పలికిన పార్టీ తాజా పరిస్థితుల నేపథ్యంలో బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు నిన్న జరిగిన పార్టీ సీనియర్ నాయకుల సమావేశంలో నిర్ణయించారు. తమ నిర్ణయాన్ని తెలియజేసేందుకు ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను కూడా కలవాలని భావిస్తున్నారు. తొలుత బిల్లుకు మద్దతు ఇచ్చినా, ప్రజాగ్రహం నేపథ్యంలో పార్టీ నేతలు పలువురు రాజీనామా చేయడంతో అధిష్టానం కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. అసోంకు చెందిన పలువురు బీజేపీ నేతలు కూడా క్యాబ్ కు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ పార్టీ నాయకులు జగదీష్ భూయాన్, జతిన్బోరా ఇప్పటికే తమ పదవికి రాజీనామా చేశారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిరవధిక కర్ఫ్యూ సైతం లెక్కచేయక ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. అసోంలో జరిగిన నిరసనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది వరకు గాయపడ్డారు. ముఖ్యమంత్రి శర్వానంద్ సోనోవాల్, కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలీ ఇళ్లపైకి జనం రాళ్లు రువ్వారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ, అసోం గణ పరిషత్(ఏజీపీ) నేతల ఇళ్లపై నిరసనకారులు దాడులకు దిగారు. గువహటిలో ఏజీపీ ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యాలయాలపై కూడా దాడులు చేసిన సంగతి తెలిసిందే.