లక్నో: ఓ న్యాయశాస్త్ర విద్యార్థినిపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టయిన బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానందకు మరో కష్టం వచ్చింది. ఆయన యోగి గుర్తింపును కోల్పోనున్నారు. చిన్మయానందను తమ సంఘం నుంచి బహిష్కరించాలని అఖిల భారతీయ అఖాడ పరిషత్(ఏబిఏపీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఏబిఏపి అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి ఆధ్వర్యంలో శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో చిన్మయానందను సాధువుల సంఘం నుంచి బహిష్కరించే నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల అక్టోబర్ 10న హరిద్వార్ లో జరిగే అధికార సమావేశంలో సభ్యుల అంగీకారంతో ఈ నిర్ణయానికి ఆమోదం తెలుపనున్నారు. నాయ్యశాస్త్ర విద్యార్థినిని లైంగికంగా వేధించినట్లు చిన్మయానంద అంగీకరించారని, ఈ పనితో సాధువు సమాజానికి తలవంపులు తెచ్చారని ఏబిఏపి అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి అన్నారు.
ప్రస్తుతం చిన్మయానంద్ మహమండలేశ్వర్ లో మహా నిర్వాణి అఖాడాగా ఉన్నారు. ఇకపై ‘యోగి’ లేదా ‘స్వామి’ అనే గుర్తింపును ఆయన కోల్పోనున్నారు. 73 ఏళ్ల చిన్మయాంద అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మహాంత్ అవిద్యనాథ్(యూపీ సీఎం యోగి అధిత్యనాత్ గురువు)తో కలిసి రామ్ మందిర్ ముక్తి యజ్ఞ సమితిని చిన్మయానంద ఏర్పాటు చేశారు. రామ్ విలాస్ వేదాంతి, రామ్ చంద్ర పరమహన్స్ వంటి సాధువులు కూడా ఈ ఉద్యమంలో చేరారు. 1986 జనవరి 19న చిన్మయానంద రామ్ జన్మభూమి ఆందోళన్ సంఘర్ష్ సమితి కన్వీనర్ గా కూడా వ్యవహరించారు.
లా చదువుతున్న 23 ఏళ్ల యువతిని సంవత్సరం పాటు అత్యాచారం చేసిన కేసులో చిన్మయాందను యూపీ సిట్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వైద్య పరీక్షలు నిర్వహించి, షాజహాన్పూర్లోని కోర్టులో హాజరుపరుచగా.. న్యాయమూర్తి ఆయనను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించారు. తనపై వచ్చిన దాదాపు అన్ని ఆరోపణలను చిన్మయానంద అంగీకరించాడని సిట్ అధికారులు తెలిపారు. ఈ విధంగా చేసినందుకు తాను సిగ్గుపడుతున్నానని , అనేకసార్లు ఆమెను వేధించినట్టుగా ఒప్పకున్నారని వెల్లడించారు.