(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఏపీ రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) మధ్యంతర నివేదికను శనివారం ప్రభుత్వానికి అందించింది.తుది నివేదికను త్వరలోనే సమర్పించే అవకాశం ఉంది. జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చిన మరునాడే బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు నివేదిక ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. జీఎన్ రావు కమిటీ నివేదిక నేపథ్యంలో ఏపీ రాజధాని అమరావతేనా ? లేక, సీఎం జగన్ చెప్పినట్టు మూడు నగరాలా ? అనేదానిపై గందరగోళం నెలకొంది. జీఎన్ రావు కమిటీ నివేదిక ప్రకారం ఏపీలో మూడు రాజధానులే ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు ఇచ్చే తుది నివేదిక కోసం ఎదురుచూస్తోంది.
రాజధాని వ్యవహారంపై జీఎన్ రావు కమిటీ మాత్రమే కాదు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు కూడా అధ్యయనం చేస్తోంది. రాజధానిపై ఓ మధ్యంతర నివేదిక సమర్పించిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు.. ప్రస్తుతం పూర్తిస్థాయి నివేదికపై కసరత్తులు చేస్తోంది. ఇక తాజా మధ్యంతర నివేదికలో.. గ్రీన్ ఫీల్డ్ రాజధాని బదులు బ్రౌన్ ఫీల్డ్ రాజధాని ఏర్పాటు చేస్తే సత్వర అభివృద్ధి సాధ్యం అవుతుందని బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ అభిప్రాయపడింది. కొత్తగా రాజధానిని నిర్మించే బదులు.. ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం రాజధాని అయితే మరింత వేగంగా డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుందని కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం.
ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు అధ్యయనం చేస్తుందని అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ తెలిపారు. కొత్తగా రాజధాని నగరాన్ని నిర్మించడాన్ని గ్రీన్ఫీల్డ్ రాజధాని అంటారు. ఇందులో ప్రతి నిర్మాణమూ కొత్తదే ఉంటుంది. బ్రౌన్ ఫీల్డ్ క్యాపిటల్ విషయానికి వస్తే.. ఇప్పటికే ఉన్న నగరంలో రాజధానిని ఏర్పాటు చేస్తారు. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు తుది నివేదిక ఇచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. రాజధానిలో సాంకేతిక అంశాలపై కూడా ఈ కమిటీ అధ్యయనం చేస్తోంది. ఈ కమిటీ నివేదిక అందిన తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించి.. అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
ఏపీ రాజధాని విషయమై జీఎన్ రావు కమిటీ శుక్రవారమే(డిసెంబర్ 20) సీఎం జగన్కు నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలోని 13 జిల్లాలను నాలుగు ప్రాంతాలుగా విభజించాలని జీఎన్ రావు కమిటీ పేర్కొంది. తుళ్లూరులోనే అసెంబ్లీ, రాజ్ భవన్ ఉండాలని.. విశాఖలో హైకోర్టు బెంచ్, సెక్రటేరియట్, సీఎం క్యాంపు ఆఫీస్, వేసవి అసెంబ్లీ ఉండాలని తమ నివేదికలో సూచించింది. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, తుళ్లూరు ప్రాంతంలో వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు సిఫారసు చేసింది. ఈ కమిటీ నివేదికపై డిసెంబర్ 27న సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ లో చర్చించనున్నారు.
మరోవైపు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు ఇచ్చే తుది నివేదిక ఎలా ఉంటుంది అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీఎం జగన్, జీఎన్ రావు కమిటీ చెప్పిన అంశాలే ఉంటాయా ? లేక భిన్నంగా ఏవైనా సూచనలు చేసారా ? అన్నది ఉత్కంఠగా మారింది. ఇదిఇలా ఉంటే.. మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తున్న అమరావతి రైతులు.. జీఎన్రావు కమిటీ రిపోర్ట్పై ఆందోళనలు మరింత ఉధృతం చేశారు.