(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
రాజధాని అమరావతిపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదిక సిద్ధమైంది. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ని బీసీజీ ప్రతినిధులు కలిసి, ఈ నివేదిక అందజేయనున్నారు. ఈ నివేదిక సమర్పించిన తర్వాత ఈ నెల 8న కేబినెట్ భేటీలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది. ఈ నెల 20లోపు హైపవర్ కమిటీ తుది నివేదికను అందజేయనుంది. రిపబ్లిక్ డే తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ మూడు నివేదికలపై అసెంబ్లీలో చర్చించనున్నారని సమాచారం. అవసరాన్ని బట్టి అఖిల పక్ష సమావేశం నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 27న జరిగిన కేబినెట్ భేటీలో ప్రధానంగా రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన రిపోర్టును సీఎం జగన్, మంత్రులు చర్చించారు. అమరావతిలో పరిస్థితులు, విశాఖలో పరిపాలనా పరంగా రాజధాని ఏర్పాటు ప్రతిపాదన, రాజధానిలో రైతులకు ఎలా న్యాయం చేయాలి ? లాంటి అంశాలన్నింటిపైనా చర్చించారు. రాజధానితోపాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై సిఫార్సులు చేసిన జీఎన్ రావు కమిటీ నివేదికపై కేబినెట్ సమగ్రంగా చర్చ జరిగింది. అయితే, కేబినెట్ సమావేశంలో రాజధాని అంశంపై ఏ నిర్ణయం తీసుకోలేదు. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చే పూర్తిస్థాయి నివేదిక తర్వాతే నిర్ణయం తీసుకోవాలని నిర్ణయాన్ని అప్పుడు వాయిదా వేశారు. జీఎన్రావు కమిటీతో పాటు బోస్టన్ కమిటీ నివేదికపై బుగ్గన నేతృత్వంలో హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది. జనవరి చివరి వరకు ఏపీకి రాజధాని ఏంటన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత.. శాసన సభను సమావేశపరిచి రాజధానిపై వివరాలను ప్రకటన చేయనున్నారు.
ఏపీ రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) మధ్యంతర నివేదికను డిసెంబర్ 21న ప్రభుత్వానికి అందించింది. తుది నివేదికను జనవరి 3వ తేదీన సమర్పించనుంది. జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చిన మరునాడే బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు నివేదిక ఇచ్చింది. జీఎన్ రావు కమిటీ నివేదికతో ఏపీ రాజధాని అమరావతేనా లేక, సీఎం జగన్ చెప్పినట్టు మూడు నగరాలా అనేదానిపై గందరగోళం నెలకొంది. జీఎన్ రావు కమిటీ నివేదిక ప్రకారం మూడు రాజధానులే ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు నివేదిక కోసం ఎదురుచూస్తోంది.
మధ్యంతర నివేదికలో.. గ్రీన్ ఫీల్డ్ రాజధాని బదులు బ్రౌన్ ఫీల్డ్ రాజధాని ఏర్పాటు చేస్తే సత్వర అభివృద్ధి సాధ్యం అవుతుందని బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ అభిప్రాయపడింది. కొత్తగా రాజధానిని నిర్మించే బదులు.. ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం రాజధాని అయితే మరింత వేగంగా డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుందని కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. కొత్తగా రాజధాని నగరాన్ని నిర్మించడాన్ని గ్రీన్ఫీల్డ్ రాజధాని అంటారు. ఇందులో ప్రతి నిర్మాణమూ కొత్తదే ఉంటుంది. బ్రౌన్ ఫీల్డ్ క్యాపిటల్ విషయానికి వస్తే.. ఇప్పటికే ఉన్న నగరంలో రాజధానిని ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు ఇచ్చే తుది నివేదికపై సర్వత్ర టెన్షన్ నెలకొంది.