ఎఫ్ఐఆర్ పెట్టాలన్న పోలింగ్ అధికారి
శ్రీనగర్: లడక్ ఎన్నికలలో తమ పార్టీకి అనుకూలంగా కథనాలు రాయాలంటూ కొందరు మీడియా ప్రతినిధులకు కవర్లలో డబ్బులు పెట్టి ఇచ్చినట్లు బీజేపీపై వచ్చిన ఫిర్యాదులకు ప్రాథమికంగా ఆధారాలున్నాయని నిజ నిర్ధారణ కమిటీ తేల్చింది. దాతో ఈ విషయంలో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి సూచనలు ఇవ్వాలని జిల్లా కోర్టును పోలీసుల ద్వారా సంప్రదించినట్లు లేహ్ జిల్లా ఎన్నికల అధికారి, డిప్యూటీ కమిషనర్ అవనీ లావాసా తెలిపారు. అయితే కోర్టు మాత్రం ఇంకా ఈ విషయంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. ఫిర్యాదు ప్రకారం బీజేపీ నేతలు పాల్పడిన కోడ్ ఉల్లంఘన క్రిమినల్ నేరం అవుతుందని చెప్పారు.
2013 జమ్ము కశ్మీర్ బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అయిన లావాసా.. ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా కుమార్తె కావడం గమనార్హం. ఆయన కూడా మాజీ ఐఏఎస్ అధికారి, ఇంతకుముందు మోదీ, షాలకు క్లీన్ చిట్ ఇచ్చే విషయంలో ఎన్నికల సంఘం నిర్ణయంతో ఆయన విభేదించారు కూడా. మీడియా ప్రతినిధులకు లంచం ఇచ్చినట్లు ప్రాథమికంగా రుజువైన తర్వాత దీనపై ఎఫ్ఐఆర్ లేదా ఫిర్యాదు నమోదు చేయాలని పోలీసులకు తాము రాశామని అవని చెప్పారు. పోలీసులు ఫిర్యాదు రాసి కోర్టుకు సమర్పించారని తెలిపారు. కోర్టులో మొత్తం మూడు ఫిర్యాదులున్నాయని, ఒకటి తమది.. మరో రెండు ప్రెస్ క్లబ్ వాళ్లు తనకు ఇచ్చినది, ఎస్.హెచ్.ఓ వద్ద ఉన్నది అని చెప్పారు. జమ్ము కశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా, ఎమ్మెల్సీ విక్రమ్ రణ్ ధవాలు మే 2న జరిగిన విలేకరుల సమావేశంలో మీడియాకులంచాలు ఇచ్చారని ప్రెస్ క్లబ్ వర్గాలు ఫిర్యాదు చేశాయి.
ఇచ్చినది డబ్బు కాదు.. ఆహ్వానమే
అయితే ఈ ఆరోపణలను రవీందర్ రైనా ఖండించారు. తాము కవర్లు ఇచ్చిన మాట వాస్తవమేనని, కానీ అందులో ఉన్నది డబ్బులు కాదని అన్నారు. రెండు రోజుల్లో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ లేహ్ ప్రాంతంలో ప్రచారం చేయనున్నారని, దానికి సంబంధించిన ఆహ్వానాలు ఇచ్చామని చెప్పారు. తాము 2000 కార్డులు ముద్రించి ప్రముఖులకు ఇచ్చామని, అందులో భాగంగానే మీడియాకూ అందించామని ఆయన అన్నారు. తాను వ్యక్తిగతంగా ఎవరికీ కవరు ఇవ్వలేదని, ఫిర్యాదులో తన పేరును పేర్కొన్నవారిపై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు.
కొందరు బీజేపీ నేతలు రిపోర్టర్లకు కవర్లు ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వారిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఒక మహిళ కవరు తెరిచ చూసి, వెంటనే ఒక బీజేపీ నేత వద్దకు వెళ్లి తిరిగి ఇవ్వబోగా, తీసుకోవడానికి నిరాకరిస్తారు. ఆమె దాన్ని టేబుల్ మీద పెట్టి వెళ్లిపోతారు.