న్యూఢిల్లీ: పౌరసత్వం సవరణ చట్టం (సిఎఎ)పై స్టే ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ వాదన వినకుండా చట్టాన్ని నిలుపుదల చేసేది లేదని కోర్టు స్ఫష్టం చేసింది. సిఎఎను సవాలు చేస్తూ దాఖలయిన 143 పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ ప్రారంభించింది. జవాబు దాఖలు చేసేందుకు కేంద్రప్రభుత్వానికి కోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చింది.
సిఎఎను సవాలు చేస్తున్న పిటిషన్లపై హైకోర్టులు విచారణ చేపట్టరాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎ బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్లను విచారించేందుకు అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రదాన న్యాయమూర్తి తెలిపారు. అవసరం అనుకుంటే ఆ ధర్మాసనం తాత్కాలిక ఉత్తర్వులు ఇస్తుందని బెంచ్ తెలిపింది. అస్సాం. త్రిపుర రాష్ట్రాలలో సిఎఎ అమలు పద్ధతి భిన్నం కాబట్టి వాటికి సంబంధించిన పిటిషన్లను విడిగా వింటామని ధర్మాసనం తెలిపింది.
ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన సిఎఎను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. పొరుగు దేశాల నుంచి వచ్చే వలసదారులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టం మతాన్ని ప్రాతిపదికగా పరిగణిస్తున్నది. హిందువులు, సిక్కులు, పార్సీలు, బౌద్ధులు, క్రిష్టియన్లు, జైనులకు పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన ఈ చట్టం పరిధి నుంచి ముస్లింలను మినహాయించారు. ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని ప్రతిపక్షాలూ, పౌర సంఘాలూ వాదిస్తున్నాయి.