(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి:అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించే దిశగా జగన్ నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వం అధికారికంగా ముందడుగు వేసింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించే రాజధాని ప్రాంతం అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్డిఎ)ను అమలులోకి తెచ్చిన సిఆర్డిఎ చట్టాన్ని రద్దు చేయడం, పాలనా రాజధానిని విశాఖ తరలించేందుకు మార్గం సుగమం చేయడం లక్ష్యంగా రెండు బిల్లులను సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టారు.
ఉదయం అసెంబ్లీ సమావేశం ప్రారంభానికి ముందు సమావేశమైన మంత్రిమండలి ఈ రెండు బిల్లులను ఆమోదించింది. అనంతరం సభలో సిఆర్డిఎ రద్దు బిల్లును మునిసిపల్ పాలన మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశ పెట్టారు. పాలనా వికేంద్రీకరణ బిల్లును ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రవేశపెట్టారు.
రాజధాని విషయంలో ఆలోచనలను అమలు చేయడం కోసం ప్రత్యేకంగా శాసనసభనూ, మండలినీ సమావేశపరిచారు. ఈ సమావేశాలు మూడు రోజులు పాటు జరుగుతాయి.
కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
- హైపవర్ కమిటీ నివేదికకు మంత్రివర్గ ఆమోదం
- పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లుకు ఆమోదం
- పాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి బిల్లుకు ఆమోదం
- సిఆర్డిఏ రద్దుకు కేబినెట్ ఆమోదం
- రైతు కూలీలకు ఇచ్చే పరిహారం 2500 రూపాయల నుండి 5000 రూపాయలకు పెంపు
- రైతులకు 15 ఏళ్ల పాటు కౌలు చెల్లించేందుకు నిర్ణయం
- రాజధాని ప్రాంతంలో ప్లాట్లు అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాలని నిర్ణయం
- పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు నిర్ణయం
- ఏఎంఆర్డిఏ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
- రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం
- ఇన్సైడర్ ట్రేడింగ్కు సంబంధించి లోకాయుక్త విచారణకు ఆమోదం
- హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం
- అమరావతిలోనే కొనసాగనున్న అసెంబ్లీ
- విశాఖ కేంద్రంగా సచివాలయ కార్యకలాపాలు
- మంత్రులు రెండు చోట్ల అందుబాటులో ఉండాలని నిర్ణయం
- రాష్ట్రాన్ని నాలుగు పరిపాలన జోన్లుగా విభజించాలని నిర్ణయం
- జిల్లాల విభజన తర్వాత సూపర్ కలెక్టరేట్ వ్యవస్థ ఏర్పాటు