(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
తెలంగాణలో సమ్మె చేస్తున్న 48 వేల మంది ఆర్టీసీ కార్మికులనూ, ఉద్యోగులనూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్క దెబ్బతో డిస్మిస్ చేశారు. ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన అనంతరం సిఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం అన్ని వేలమందీ ఇక ఆర్టీసీ ఉద్యోగంలో లేనట్లే. ముఖ్యమంత్రి ప్రకటన పర్యవసానాలు ఎలా ఉంటాయి ఏమిటి అన్న సంగతి అలా ఉంచితే, ఆయన అన్న మరో మాట చర్చనీయాశం అయింది.
ఈ ఖాళీలు భర్తీ చేయడం కోసం వెంటనే రిక్రూట్మెంట్ మొదలు పెట్టాల్సిందిగా ఆయన ఆదేశించారు. కొత్తగా ఉద్యోగంలో చేరేవారు యూనియన్లలో చేరబోమంటూ ఒప్పందపత్రంపై సంతకం చేయాలని ఆయన అన్నట్లు ఆ ప్రకటన తెలిపింది. సంఘాలు ఏర్పాటు చేసుకోవడం, వాటిలో చేరి కార్యకలాపాలలో పాల్గొనడం రాజ్యాంగం దేశ పౌరులకు కల్పించిన ప్రాధమిక హక్కు. రాజ్యాంగంలోని 19 (1)(సి) ఆర్టికల్ ఈ పౌరులందరికీ ఈ హక్కు కల్పిస్తోంది.
ఇప్పుడు రాజ్యాంగంలో పొందుపరచిన ఒక ప్రాధమిక హక్కును కాలరాస్తామంటూ అదే రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసిన ఒక ముఖ్యమంత్రి ప్రకటించవచ్చా అన్నది ప్రశ్న. ఆ ప్రకటన చేసిన ముఖ్యమంత్రి రేపు తూచ్ అనవచ్చు. కెసిఆర్ అన్నా అంటారు. కానీ చట్టాలకు లోబడి వ్యవహరించాల్సిన ప్రభుత్వ అధికారులు ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ముందుకు వెళ్లడం సాధ్యమేనా? రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నామని తెలిసీ వారు అలాంటి ఒప్పంద పత్రాలపై ఉద్యోగుల సంతకాలు డిమాండ్ చేయగలరా?
ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఆర్టీసికి సర్వీస్ రూల్స్ అనేవి ఉంటాయి. సహజంగానే అవి చట్టాలకు లోబడి ఉంటాయి. ఉగ్యోగులను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్నా గానీ వారితో చేసుకునే ఒప్పందం ఆ సర్వీస్ రూల్స్కు వ్యతిరేకంగా ఉండరాదు. ఇలాంటి నేపధ్యంలో ముఖ్యమంత్రి నోటిమాటగా చెప్పారని అధికారులు తెలిసితెలిసీ చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే సాహసం చేస్తారా? ఇదంతా కూడా ముఖ్యమంత్రి ప్రకటించిన మూకుమ్మడి డిస్మిస్ ఉత్తర్వులు నిజంగా అమలయినప్పటి సంగతి కదా అనుకోవచ్చు కూడా. అప్పుడయినా ఒక ముఖ్యమంత్రి అంత బాహటంగా రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడమేమిటన్న ప్రశ్న మిగిలే ఉంటుంది.