ఇది ఇక గత వైభవం కింద లెక్కేనా
అమరావతి: టిడిపి నుంచి లోక్సభకు ఎన్నికయిన ముగ్గురిలో విజయవాడ ఎంపి కేశినేని నానీ తన పార్టీని ఇబ్బంది పెట్టేందుకు సోషల్ మీడియాను చాలా ప్రభావవంతంగా ఉపయోగించుకుంటున్నారు. ఘోర పరాజయం పాలయిన పార్టీకి కష్టకాలంలో అండగా నిలబడాల్సిన ఎంపీ ఎందుకలా ప్రవర్తిస్తున్నట్లు? పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడిన తర్వాత కూడా నానీ పోరాడితే పోయేదేమీ లేదనడంలో అర్ధం ఏమిటి? ఇంతకీ ఎవరిపై ఆయన పోరాటం?
కేశినేని నానీ మనసులో ఏదో ఉందనేది సుస్పష్టం. అది ఏమిటనే విషయంలో టిడిపి వర్గాలలో రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇదంతా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజిపివైపు చూపు సారించడం వల్ల వచ్చిన తేడాయేనని కొందరు అంటున్నారు.
నిజానికి టిడిపి నుంచి బిజెపి వైపు చూస్తున్నవారికి సంబంధించి ఆ పార్టీలో వినబడుతున్న గుసగుసలు నిజమైన పక్షంలో టిడిపికి పెనుముప్పు పొంచిఉన్నట్లే. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్న బిజెపి నాయకత్వం మాటలను ఎవరూ తేలికగా తీసుకోవడం లేదు. పశ్చిమ బెంగాల్లో బిజెపి ఏ విధంగా పాగా వేసిందో చూసిన తర్వాత ఎవరూ తేలికగా తీసుకోలేరు కూడా.
అందుకనే టిడిపి నుంచి చాలామంది చూపు బిజెపిపై ఉంది. పార్టీ వర్గాలలో వినబడుతున్న దాని ప్రకారం దాదాపు 25 మంది నాయకులు అటు దృష్టి సారించారు. వారిలో విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కొందరు,. రాయలసీమ జిల్లాల నుంచి కొందరు ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, గురజాల మాజీ శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు పేర్లు మొదటే వినబడ్డాయి కానీ వారు ఈ ఊహాగానాలను ఖండించారు.
అయితే వారు అటు వెళ్లినా ఆశ్చర్యపడక్కరలేదనీ, నిప్పు లేనిదే పొగ రాదనీ పార్టీలో అనుకుంటున్నారు. అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబం, జెసి సోదరులు, కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి బిజెపి వైపు చూస్తున్నవారిలో ఉన్నారని చెబుతున్నారు. గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ గురించి కూడా గుసగుసలు వినబడుతున్నాయి. ఆఖరికి చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన సుజనా చౌదరి, సిఎం రమేష్ గడప దాటినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
బిజెపి వైపు చాలామంది చూపు ఉండడానికి అధికారంలో మజా ఒక కారణం అయితే, కేసుల వేధింపుల నుంచి తప్పించుకోవడం మరో కారణంగా కనబడుతోంది. ఒకటి మాత్రం ఖాయంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బిజెపి ఎదగాలంటే టిడిపినే బలహీనపరచాలి. అందుకు నరేంద్ర మోదీ, అమిత్ షా నాయకత్వంలోని ఆ పార్టీ సామ దాన బేధ దండోపాయాలన్నీ ప్రయోగిస్తుందనడంలో సందేహం అక్కర లేదు. వత్తిడులను కానీ, ప్రలోభాలను కానీ టిడిపిలో ఎంతమంది ప్రతిఘటించగలరో చూడాలి. టిడిపికి రానున్న రోజులు గొప్ప పరీక్షా సమయం.