రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో డేటా చోరీ కేసుపై చర్చ నడుస్తోంది. ఇది రాజకీయ కోణం సంతరించుకోవడంతో చర్చలో వేడి పెరిగింది. తెలంగాణాలోని టిఆర్ఎస్ ప్రభుత్వం ఆంధ్రాలోని ప్రధాన ప్రతిపక్షం వైసిపికి అనుకూలంగా ఈ కథ నడుపుతోందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నది.
తప్పు చేయకపోతే ఉలుకెందుకని టిఆర్ఎస్ నాయకత్వం ప్రశ్నిస్తున్నది. ఇటీవలి తెలంగాణా శాసనసభ ఎన్నికలలో టిడిపి కాంగ్రెస్తో పొత్తుపెట్టుకుని పోటీ చేయడంతో కథ మొదలయింది. ఎన్నికల ప్రచారం కోసం చంద్రబాబు హైదరాబాద్ వెళ్లడంతో అప్పటివరకూ వెనుకంజలో ఉన్న టిఆర్ఎస్ అధినేత కెసిఆర్కు మంచి అవకాశం చిక్కింది. ఆయన మళ్లీ తెలంగాణా సెంటిమెంట్ రగిల్చి విజయం సాధించారు.
నిజానికి కెసిఆర్కు తెలంగాణాలో టిడిపి ఉనికి గిట్టదని అందరికీ తెలుసు. 2014 ఎన్నికలలో బొటాబొటీ సీట్లతో అధికారం దక్కించుకున్న కెసిఆర్ తెలుగుదేశం పార్టీకి 15 సీట్లు రావడాన్ని జీర్ణించుకోలేక పోయారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో నయానా భయానా మెజారిటీ టిడిపి ఎమ్మేల్యేలను తన పార్టికి ఫిరాయించేట్లు చేశారు.
2018 ఎన్నికలలో తనను ఓడించేందుకు టిడిపి కాంగ్రెస్తో జత కట్టడాన్ని కెసిఆర్ భరించలేక పోయారు. గెలుపు సాధించిన అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలే అందుకు తార్కాణం. టిడిపికి తెలంగాణాలో ఏం పని అని ఆయన ప్రశ్నించారు. తాను కూడా వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు. ఇప్పుడు తెలంగాణా పోలీసులు దర్యాప్తు చేస్తున్న డేటా చోరీ కేసు ఆ రిటర్న్ గిఫ్ట్లో భాగమేనని టిడిపి నాయకత్వం భావిస్తున్నది.
ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన డేటా, టిడిపి యాప్ సేవామిత్రకు ఐటి సహకారం అందుస్తున్న ఐటి గ్రిడ్ అనే సంస్థ దగ్గర కూడా ఉందన్నది ప్రధానమైన అభియోగం. ప్రభుత్వాన్ని నడుపుతున్న తెలుగుదేశం పార్టీ ద్వారా ఐటి గ్రిడ్కు ఈ డేటా అందిందన్నది తెలంగాణా పోలీసుల దర్యాప్తు తీసుకుంటున్న కోణం. లోకేశ్వర్రెడ్డి అనే కడప జిల్లాకు చెందిన వ్యక్తి సైబరాబాద్ పోలీసులకు ఈ ఫిర్యాదు చేశారు. ఆయన వైసిపి అధినేత జగన్మోహన రెడ్డికి సన్నిహితుడు. ఫిర్యాదు వచ్చిందే తడవు సైబరాబాద్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగిపోయారు.
తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ కోసం ఈ డేటాను ఐటి గ్రిడ్కు అందించిందా లేదా అన్న విషయాన్ని అలా ఉంచితే, ఆ కేసును దర్యాప్తు చేసేందుకు తెలంగాణా పోలీసులకు ఉన్న ఆర్హత ఏమిటి అన్నది ప్రశ్న. ఆ అర్హత వారికి లేదని టిడిపి నాయకత్వం వాదిస్తున్నది.
చోరీకి గురయిందన్న డేటా ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారం. ప్రభుత్వ పధకాల కోసం సేకరించిన సమాచాన్ని ఇతరులకు ఇవ్వడం నేరం అన్న తీరులో మొన్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ మాట్లాడారు. డేటా ఎక్కడికీ పోలేదు అంతా భద్రంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఆధికారులు అంటున్నారు.
లోకేశ్వర రెడ్డి ఫిర్యాదు ఇచ్చింది ఐటి గ్రిడ్పై కాబట్టి తెలంగాణా పోలీసులు హైదరాబాద్లోని ఆ సంస్థపై దర్యాప్తు చేస్తున్నారు. డేటా చోరీకి గురయి ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున విషయం తేల్చాల్సింది ఆ రాష్ట్రప్రభుత్వం. ఐటి గ్రిడ్ సంస్థకు డేటా ఇచ్చిందే ఆ ప్రభుత్వం కదా వారే తేలుస్తారు అని తెలంగాణా పోలీసులు అనవచ్చు. అంతవరకూ బాగానే ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బోనెక్కించే న్యాయపరిధి మరో రాష్ట్రప్రభుత్వానికి ఉంటుందా అన్న ప్రశ్న ఎదురవుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం సంగతి అలా ఉంచితే టిడిపి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం వరకూ టిఆర్ఎస్ విజయం సాధించింది.