జైపూర్: చూడగానే ముద్దొచ్చే చిన్న పిల్లల ప్రకటనలతో అందరినీ ఆకర్షించే జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ షాంపూలలో కేన్సర్ కలగజేసే రసాయనాలు ఉన్నాయట. రెండు బ్యాచ్ ల షాంపూలను రాజస్థాన్ లో పరీక్షించగా వాటిలో ఫార్మాల్డిహైడ్ అనే రసాయనం ఉన్నట్లు తేలింది. దానివల్ల కేన్సర్ వచ్చే ప్రమాదముంది. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ లో కేన్సర్ కలగజేసే ఆస్బెస్టాస్ ఏమైనా ఉందేమోనని కొన్ని నెలల క్రితం అధికారులు పరీక్షలు చేశారు. అదేమీ లేదని తెలిసిన తర్వాతే పౌడర్ మళ్లీ ఉత్పత్తి చేస్తున్నామని జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తెలిపింది.
తాజాగా రాజస్థాన్ లో జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ షాంపూ 24 బాటిళ్లను అక్కడక్కడ తీసుకుని వాటిని పరీక్షించారు. షాంపూ నిల్వ ఉండేందుకు ఫార్మాల్డిహైడ్ అనే రసాయనాన్ని వాడారని రాజస్థాన్ డ్రగ్ కంట్రోలర్ రాజారామ్ శర్మ తెలిపారు. జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్లు అదేమీ లేదని చెప్పినా, షాంపూలో మాత్రం అది ఉన్నట్లు పరీక్షలలో తేలిందన్నారు. అది ఎంత శాతం ఉందో చెప్పలేమని, అయితే ఇప్పుడు కంపెనీ సవాలు చేసినందున మరోసారి శాంపిళ్లను కేంద్ర డ్రగ్ ల్యాబొరేటరీకి పంపుతామని ఆయన చెప్పారు.
తమకు ఇచ్చిన తాత్కాలిక నివేదికను తాము ఆమోదించబోమని జాన్సన్ అండ్ జాన్సన్ ప్రతినిధులు అన్నారు. ఆ నివేదికలో.. తమ షాంపూలో ప్రమాదకరమైన పదార్థాలున్నాయని, ఫార్మాల్డిహైడ్ ఉన్నట్లు తేలిందని ఉందని చెప్పారు. ప్రతి రెండు నెలలకోసారి డ్రగ్ కంట్రోల్ అధికారులు మందులు, కాస్మెటిక్ శాంపిళ్లను పరీక్షిస్తారు. ఈ నెలలో చేసిన పరీక్షలలో ఏడు శాంపిళ్లు విఫలమయ్యాయి.