(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: రాజధాని ప్రజల అస్తిత్వానికి భంగం కలిగితే బలిదానాలకు వెనుకాడమని అమరావతి ప్రాంత రైతులు స్పష్టం చేశారు.రాజధాని విషయంలో ప్రభుత్వ ఆలోచనలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు తీవ్రతరం చేయాలని అమరావతి ప్రాంత ప్రజానీకం నిర్ణయించింది.భవిష్యత్తు కార్యాచరణ ఖరారుకు రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయనిపాలెంలో రైతులు, రైతు కూలీలు సమావేశమయ్యారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్తో నేడు అమరావతి ప్రాంత బంద్కు పిలుపునిచ్చారు.ప్రజలంతా రోడ్లపైకి వచ్చి నిరసనల్లో పాల్గొనాలని రైతులు కోరారు.
సచివాలయం ఉన్న వెలగపూడిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు.ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వచ్చే వరకూ ఆందోళనలు కొనసాగించాలని రైతులు నిర్ణయించారు.రాజధాని పోరు కొనసాగిస్తామని రైతులు చెప్పారు.ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని ప్రాంతాన్ని మార్చడం అంటే ఆయనను అవమానించడమేనని రైతులు అంటున్నారు.అభివృద్ధి వికేంద్రీకరణ అంటే మూడు రాజధానులు ఏర్పాటు చేయడమా అని వారు ప్రశ్నించారు.
కాగా రాజధాని బంద్ పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు.అమరావతి ప్రాంతంలో 144 సెక్షన్, 34 పోలీసు యాక్ట్ అమల్లో ఉన్నాయని తుళ్లూరు డి ఎస్ పి శ్రీనివాసరెడ్డి మీడియాకు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా నిరసనలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డి ఎస్ పి హెచ్చరించారు.