(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
యాదాద్రిలో శిల్పాలపై కేసీఆర్ చిత్రాల వివాదం ముగిసింది. యాదాద్రిలో అష్టభుజి ప్రాకారంలో ఉన్న స్తంభాలపై కేసీఆర్తో పాటు ఎలాంటి రాజకీయ చిత్రాలు ఉంచకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా భారీ ఎత్తున చెక్కిన శిల్పాల్లో కేసీఆర్ చిత్రం, టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారుతోపాటు తెలంగాణ ప్రభుత్వ పథకాల లాంటివి స్తంభాలపై చెక్కడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో అది రాజకీయ దుమారానికి తెరలేపింది. యాదాద్రిలో కేసార్ బొమ్మలేమిటి అంటూ పలు రాజకీయ పార్టీల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యాదాద్రిలో ధర్నాలు కూడా నిర్వహించారు. దీంతో ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. స్తంభాలపై ఉన్న రాజకీయ పార్టీల చిత్రాలను తొలగించాలని ఆదేశించింది. యాదాద్రి ఆలయంలో దైవ సంబంధిత చిహ్నాలే తప్ప మరే ఇతర చిత్రాలు ఉండడానికి వీల్లేదని అధికారులను ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కె.భూపాల్ రెడ్డి ఆదేశించారు.
కేవలం దేవాలయ విశిష్టతకు, దైవ సంబంధ అంశాలకు మాత్రమే చెక్కడాలు, కట్టడాలు పరిమితం కావాలనేది సీఎం ఆకాంక్ష అని, తక్షణం నాయకుల బొమ్మలు, పార్టీల చిహ్నాలు, ఇతర అభ్యంతరకర చెక్కడాలు తొలగించాలని భూపాల్ రెడ్డి ఆదేశించారు.
— Telangana CMO (@TelanganaCMO) September 7, 2019
స్తంభాల్లో కేసీఆర్తో పాటు గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, కమలం పువ్వు, సైకిల్ వంటి కొన్ని రాజకీయ చిహ్నాలు కూడా ఉన్నాయి. ఆలయాల్లో వాటిని చెక్కడంపై సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, మరికొందరితో ఆయన ప్రగతిభవన్లో సమావేశమై చర్చించారు. దేవాలయ పునరుద్ధరణలో చేస్తున్న నిర్మాణాలు, కట్టడాల్లో నాయకుల బొమ్మలు, పార్టీల చిహ్నాలు ఉండడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తామెవరికీ నాయకుల బొమ్మలు, పార్టీల చిహ్నాలు చెక్కమని చెప్పలేదని, ఒకరిద్దరు శిల్పులే తమ ఇష్టప్రకారం చెక్కారని వైటిడిఎ అధికారులు వివరించారు. ఆలయ ప్రాంగణంలో తన చిత్రం ఉండాలని సీఎం కేసీఆర్ కోరుకోరని, కేవలం దేవాలయ విశిష్టత, దైవ సంబంధిత అంశాలకు మాత్రమే శిల్పులు పరిమితం కావాలనేది సీఎం ఆకాంక్ష అని భూపాల్ రెడ్డి వారికి స్పష్టం చేశారు. తక్షణం నాయకుల చిత్రాలు, పార్టీల చిహ్నాలు తొలగించాలని ఆదేశించారు.
మొత్తంగా 5 వేల చిత్రాలను గీస్తే… అందులో రాజకీయ చిత్రాలు ఉండడం వివాదాలకు దారితీసింది. కేసీఆర్ రాచరికం తరహాలో వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో .. అవి తొలగించాలని ఆదేశాలు జారీ చేయడంతో వివాదం ముగిసిపోయింది.