విశాఖపట్నం: పోలీసులను దూషించిన కేసులో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదైంది. అయ్యన్నపాత్రుడి సోదరుడు సన్యాసినాయుడు ఇటీవలే వైసీపీలో చేరారు. అయితే తన నివాసంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కట్టిన నేపథ్యంలో, ఈ నెల 12న అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. శాంతిభద్రతలను కాపాడేందుకు, పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకు, పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆ సమయంలో పోలీసు విధులకు భంగం కలిగించిన అయ్యన్నపాత్రుడు, వారిని అకారణంగా దూషించారని పోలీసులు తెలిపారు. దీంతో ఆయనపై కేసును రిజిస్టర్ చేశామని నర్సీపట్నం టౌన్ సీఐ స్వామినాయుడు పేర్కొన్నారు.
నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు, సన్యాసి నాయుడు ఇద్దరు అన్నాదమ్ముళ్లు ఒకే ఇంట్లో ఉంటున్నారు. పై అంతస్తులో ఒకరు..కింది అంతస్తులో మరొకరు నివసిస్తున్నారు. అయితే ఇటీవల వైసీపీలో చేరిన అయ్యన్నపాత్రుడు తమ్ముడు సన్యాసి పాత్రుడు కుటుంబ సభ్యులు ఇంటిపై వైసీపీ జెండా కట్టేందుకు ప్రయత్నించారు. సన్యాసి పాత్రుడు కుమారుడు వరుణ్ జెండా కడుతున్న సమయంలో అయ్యన్నపాత్రుడి కుటుంబ సభ్యురాలైన లక్ష్మి అడ్డుకుంది. ఈ క్రమంలో వాగ్వాదం జరిగి.. తోపులాటలో ఆమె కిందపడిపోయింది. లక్ష్మి అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అన్నాదమ్ముళ్లు వేర్వేరు పార్టీల్లో ఉండడంతో తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.