విశాఖపట్నం: బెయిల్పై వచ్చి 12 గంటలు కూడా కాకముందే మాజీ మంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిపై మరో కేసు నమోదైంది. తన సోదరుడు సన్యాసినాయుడుతో జరిగిన వివాదంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పెట్టిన కేసులో కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్న అయ్యన్నపాత్రుడు.. బెయిల్ పత్రాలను పోలీసులకు ఇచ్చేందుకు ర్యాలీగా వెళ్లి, మరో కేసు నమోదు చేశారు. సోమవారం నర్సీపట్నంలో భారీ ర్యాలీగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అయ్యన్న.. ర్యాలీ ముగింపులో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పోలీసులు ఆరోపించారు. కోడిపందాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో పాటు, అనుమతి లేకుండా ర్యాలీ, రోడ్ షో నిర్వహించారన్న అభియోగాలపై ఐపీసీలోని 504, 189, 188, 341 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పోలీసులను దూషించిన కేసులో గతేడాది డిసెంబర్ లో అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదైందన సంగతి తెలిసిందే. వైసీపీలో చేరిన అయ్యన్నపాత్రుడి సోదరుడు సన్యాసినాయుడు.. తన నివాసంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కట్టడంతో గతేడాది డిసెంబర్ 12న అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. శాంతిభద్రతలను కాపాడేందుకు, పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకు, పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆ సమయంలో పోలీసు విధులకు భంగం కలిగించిన అయ్యన్నపాత్రుడు, వారిని దూషించారన్నారని పోలీసులు తెలిపారు. దీంతో ఆయనపై కేసును రిజిస్టర్ చేశారు. అప్పటి నుంచి అయ్యన్న కనిపించకుండా పోయారు. తర్వాత ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేశారు. జనవరి 3న అయ్యన్నకు బెయిల్ వచ్చింది. దీంతో సోమవారం నర్సీపట్నం వెళ్లి పోలీస్ స్టేషన్లో బెయిల్ పత్రాలు సమర్పించారు. అయితే, అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడం.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో మరో కేసులో బుక్కయ్యారు.