అమరావతి: రాజధానిని తరలించవద్దంటూ రైతులు చేపట్టిన హైవే దిగ్బంధంపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు 18మందిపై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కారుపై దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి కేసులో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు రేంజ్ ఐజీ తెలిపారు. శాంతి భద్రతల దృష్ట్యా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఈ దాడి ఘటనను పలువురు వైసీపీ నేతలు ఖండించారు. రైతుల ముసుగులో టీడీపీ నాయకులే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
గుంటూరు జిల్లా చినకాకాని వద్ద మంగళవారం హైవే దిగ్బంధం చేపట్టిన రైతులు.. విజయవాడ వెళ్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారును అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కారు నుంచి కిందకు దిగకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఈ క్రమంలో కొందరు కారుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో రామకృష్ణారెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే గన్ మెన్ పైనా చేయి చేసుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి.. ఎమ్మెల్యే వాహనాన్ని అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రైతుల ముసుగులో టీడీపీకి చెందిన వ్యక్తులే తనపై దాడి చేశారని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ బయటపడుతుందనే చంద్రబాబు ఇలాంటి దాడులు చేయిస్తున్నారని తెలిపారు. ఇలాంటి దాడులు కాకుండా… చేతనైతే తమపై డైరెక్టుగా దాడులు చేయాలని పిన్నెల్లి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.