హైదరాబాద్: జగన్ అక్రమ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక మాజీ ఐఎఎస్ అధికారికి మరో కొత్త చిక్కువచ్చిపడింది. మాజీ ఐఎఎస్ అధికారి సివిఎస్కె శర్మపై తాజాగా మరో కేసు నమోదు అయ్యింది. ప్రభుత్వం నుండి న్యాయసహాయం పొందేందుకు ఆయన నకిలీ బిల్లులు పెట్టి లక్షలాది రూపాయలు పొందారని పివి రమణ అనే వ్యక్తి ఆరోపించారు.
గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఏడుగురు ఐఎఎస్ అధికారులకు న్యాయ సహాయం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
నీటిపారుదల శాఖ మాజీ కార్యదర్శి సివిఎస్కె శర్మ న్యాయ సహాయం కోసం తప్పుడు బిల్లులు పెట్టి లీగల్ చార్జీల కింద 7,56,460 రూపాయలు చెల్లించాలని కోరగా బిల్లులను పరిశీలించకుండానే నాటి సిఎస్ పికె మహాంతి నిధులు మంజూరు చేయగా, రెవెన్యూ కార్యదర్శి పివి రమేష్ నిధులు విడుదల చేశారని ఫిర్యాదిదారుడు రమణ పేర్కొన్నారు.
బిల్లుల విడుదలలో శర్మకు మాజీ సిఎస్ పికె మహంతి, మాజీ రెవెన్యూ కార్యదర్శి పివి రమేష్ సహకరించారని రమణ ఆరోపించారు. పై ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రమణ కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆదేశాల మేరకు సైఫాబాద్ పోలీసులు ముగ్గురు మాజీ ఐఎఎస్ అధికారులపై కేసు నమోదు చేసినట్లు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి వెల్లడించింది.