అమరావతి: జనసేన పార్టీతో తెగతెంపులు చేసుకున్న సిబిఐ మాజీ జెడి వి.వి లక్ష్మీనారాయణ (జెడి) భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారా? లేక తెలుగుదేశం పార్టీ ఆహ్వానాన్ని మన్నించి ఆ పార్టీలో చేరతారా అనేది రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా ఉంది.
ఇటీవల కాలంలో జేడీ వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటంతో బిజెపికి దగ్గర అవుతారని కూడా వార్తలు వినపడుతున్నాయి. సిఏఏ, ఎన్ ఆర్ సి కి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు రాష్ర్టానికి కేటాయింపులు లేకపోయినా కేంద్ర బడ్జెట్ కు ప్రశంసల జల్లు కురిపించారు. ఈ కారణంగా బిజెపి వైపు చూస్తున్నారా అని కూడా భావిస్తున్నారు. మరో పక్క టిడిపి కూడా ఆయనకు ఆహ్వానాన్ని పలుకుతోంది.
అధికార వైసిపి వైపు జెడి చూసే అవకాశం లేదు అనేది అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో జెడికి అప్షన్స్ బిజెపి లేక టిడిపి. జనసేనతో తన ప్రయాణం ముగిసిన అధ్యాయం అని పేర్కొన్న జేడీ.. ఏ పార్టీ లో చేరాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించి ఉన్నారు. ఇక మీదట కూడా ప్రజా సేవ చేస్తూనే ఉంటానని చెపుతున్నారు. ప్రజా సేవకు అత్యుత్తమ వేదిక రాజకీయ రంగమేనని ఉద్ఘాటిస్తున్న జేడీ ఎ పార్టీని ఎంచుకుంటారో వేచి చూడాలి.
సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజా సేవకు అంకితం కావాలని భావించిన లక్ష్మీనారాయణ సిబిఐ నుండి స్వచ్చంద పదవి విరమణ చేశారు. సొంతగా పార్టీ స్థాపించాలని కూడా భావించారు. అయితే అందరి ఊహలకు భిన్నంగా జనసేన పార్టీలో చేరి విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. ఎన్నికల్లో జనసేన వారి ఊహలకు భిన్నంగా ఘోర పరాజయం కావడంతో జెడి పార్టీ కార్యక్రమాలకు ఆంటీ ముట్టనట్టుగా ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.