(కడప నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అధికారులు మరో మారు పులివెందులకు చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు ఆయన స్వగృహంలోనే దారుణంగా హత్య చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తునకు నాటి చంద్రబాబు ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయగా వందలాది మందిని విచారించినా దోషులను గుర్తించలేదు. ఆ తరువాత జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వంలో వేసిన సిట్ ను రద్దు చేసి మరో సిట్ ను ఏర్పాటు చేసి దర్యాప్తును జరిపారు. నెలలు గడుస్తున్నా సిట్ అధికారులు వివేకా హత్య కేసు నిందితులను అరెస్టు చేయలేదు. ఘటనా స్థలంలో సాక్షాధారాలు మాయం చేశారన్న అభియోగంపై ముగ్గురుని అరెస్టు చేసి జ్యూడిషియల్ రిమాండ్ కు పంపగా అనంతరం వారు బెయిల్ పై విడుదల అయ్యారు.
ఈ నేపథ్యంలో హతుడు వివేకా కుమార్తె డాక్టర్ సునీతతో సహా మరో ఇద్దరు ఏపి హైకోర్టులో వివేకా హత్య కేసు దర్యాప్తు బాధ్యతలను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన కోర్టు సీబీఐ దర్యాప్తునకు అదేశించడం, ఆ తరువాత వారు రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక పర్యాయం విచారణ జరిపిన సీబీఐ అధికారుల బృందం 45 రోజుల తరువాత రెండవ దఫా విచారణకు గానూ పులివెందుల డీఎస్ పి కార్యాలయానికి చేరుకున్నారు. సోమవారం నుండి ఎవరెవరిని విచారణకు హజరు పర్చాలన్న విషయాలను పులివెందుల పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. నిన్న పులివెందులలోని వివేకా ఇంటిని మరో మారు సీబీఐ అధికారులు సందర్శించారు. మొదటి దశ విచారణ రెండు వారాల పాటు జరగ్గా వివేకా కుమార్తె సునీతతో పాటు పని మనిషి లక్ష్మీదేవి, పిఎ కృష్ణారెడ్డి, శంకర రెడ్డి, సస్పెండ్ అయిన సిఐ శంకరయ్య మరో పది మందిని విచారించారు.
ఇప్పుడు నిర్వహిస్తున్న రెండవ విడత విచారణలో కీలక సమాచారాన్ని సేకరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు వైఎస్ కుటుంబ సభ్యులను, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తదితరులను విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. సీబీఐ అధికారులు విచారణను వేగవంతం చేయడంతో కేసు దర్యాప్తు క్లైయిమాక్స్ చేరుకున్నదా? దోషులు ఎవరు అనేది త్వరలో తేలిపోనున్నదా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొన్నది.