న్యూఢిల్లీ: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీ ప్రాంతంలో ‘చౌకీదార్ల’ నియామకంలో స్కాం జరిగింది. ఒకరికి బదులు మరొకరు రావడం లాంటివి చోటుచేసుకున్నాయి. దీనిపై ఎఫ్.సి.ఐ. చేసిన ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఢిల్లీ ప్రాంతంలో తమ గోడౌన్లకు చౌకీదార్ల నియామక బాధ్యతను ఎఫ్.సి.ఐ. ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఏస్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ ఈ బాద్యత చేపట్టింది. మొత్తం 53 పోస్టులకు గాను 1.08 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 2018 ఫిబ్రవరి 18న నిర్వహించిన రాతపరీక్షకు పలువురు పీజీలు సహా 98,771 మంది హాజరయ్యారు. 171 మంది అర్హత సాధించగా, వారిలో 98 మందిని శారీరక పరీక్షలు, సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత ఎంపిక చేశారు. వారిలో 53 మందికి ఉద్యోగాలిచ్చి, 43 మందిని వెయిటింగుల పెట్టారు.
అయితే, ఎంపికైన వారి నేపథ్యం చెక్ చేస్తుంటే వాళ్ల డోసియర్లలో కొన్ని అక్రమాలను ఎఫ్.సి.ఐ. గుర్తించింది. దాంతో కేసును విచారణ నిమిత్తం సీబీఐకి అప్పగించింది. కొందరు అసాంఘిక శక్తులు కూడా రాత పరీక్షను వేరే వారితో రాయించి అర్హులకు అవకాశాలు లేకుండా చేశారని ఫిర్యాదులో తెలిపింది. దీనిపై గత ఆగస్టులో ప్రాథమిక విచారణ చేసిన సీబీఐ.. ప్రైవేటు సంస్థ, అభ్యర్థులు కూడా పలు రకాల అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించి కేసు నమోదుచేసింది.
మొత్తం 96 మంది ఎంపిక చేసిన అభ్యర్థులలో 14 కేసులు ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాసినవేనని సీబీఐ తెలిపింది. గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగిన ఎఫ్.సి.ఐ. నియామకాలలో కూడా అక్రమాలు జరిగాయని చెప్పింది. బాధ్యులపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే తాము గత 20 ఏళ్లుగా 500 సార్లు విజయవంతంగా నియామకాలు చేశామని ఏస్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ చెబుతోంది.