న్యూఢిల్లీ: కరోనా లాక్ డౌన్ కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా మూడు లక్షల కోట్ల రూపాయలను రుణాలుగా ఇవ్వనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోసేలా ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ వివరాలను బుధవారం సాయంత్రం ఆమె వెల్లడించారు.
స్వయం సమృద్ధి భారత్ యే లక్ష్యం
దేశ ఆర్థిక వృద్ధిని పెంచి స్వయం సమృద్ధి భారతే లక్ష్యంగా ఈ ప్యాకేజీ ప్రకటించడం జరిగిందన్నారు. ఆర్థిక, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, జనాభా, డిమాండ్ అనే ఐదు మూల సూత్రాలుగా ఈ ప్యాకేజీ ఉంటుందన్నారు.
12నెలల మారటోరియంతో రుణాలు
సూక్ష్మ, మధ్య, లఘు, కుటీర పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు ఎలాంటి పూచీకత్తు లేకుండా నాలుగేళ్ళ కాలపరిమితి,12 నెలల మారటోరియంతో రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎంఎస్ఎంఈలకు ఆరు అంశాల్లో ఆర్థిక ప్యాకేజీతో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను నేటి నుంచి ఒక్కొక్కటిగా వివరాలను ప్రకటిస్తామని తెలిపారు.
ఆదాయపన్ను రిఫండ్ వెనక్కు
అయిదు లక్షల రూపాయల లోపు ఆదాయ పన్ను రీఫండ్ బకాయిలను వెనక్కి చెల్లిస్తామన్నారు. భారత్ స్వయం శక్తితో ఎదగాలనేదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఉత్పత్తి సామర్థ్యాల పెంపునకు రూ.10వేల కోట్లతో ఫండ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎంఎస్ఎంఈలు తక్షణం ఉత్పత్తి ప్రారంభించేందుకు, ఉద్యోగుల భద్రత కల్పించేందుకు ఈ ప్యాకేజీ ఉపయోగ పడుతుందని అన్నారు. అన్ని విభాగాల్లోనూ నగదు లభ్యతే ప్రధాన సమస్యగా ఉందనీ, తీవ్రమైన రుణ ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈలకు రూ.20 వేల కోట్లు, ఎంఎస్ఎంఈల్లో ఈక్విటీ పెట్టుబడుల కోసం రూ.50 వేల కోట్లు కేటాయింపు వల్ల రెండు లక్షల చిన్న తరహా పరిశ్రమలకు ప్రయోజనం కలగనుందని వివరించారు నిర్మల సీతారామన్.
ఆత్మ నిర్భర్ భారత్తో కొత్త ఉత్తేజం
గడిచిన ఐదేళ్లలో దేశంలో అనేక సంస్కరణలను అమలు చేశామని చెప్పిన ఆమె ప్రత్యక్ష నగదు బదిలీ మా సంస్కరణలకు మేలిమి ఉదాహరణగా పేర్కొన్నారు. భూమి, నగదు లభ్యత, పాలనాపరమైన విధానాలే కీలకమని అన్నారు. డీబీబీ, సూక్ష్మస్థాయి బీమాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.స్వచ్ఛ భారత్ అభియాన్, ఆయుష్మాన్ భారత్ తాము చేపట్టిన కీలక పథకాలుగా చెప్పుకొచ్చారు. ఎఫ్ఢీఐ నిబంధనలకు సరళీకరించి పెట్టుబడులకు మార్గం సుగమమం చేసామని, తాజాగా ప్రధాని ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ నినాదం దేశ ప్రజలకు కొత్త ఉత్తేజం ఇస్తుందని స్పష్టం చేశారు. కరోనా కష్టాల నుంచి పేదలకు ఉపశమనం కోసం గరీబ్ కల్యాణ్ యోజన అమలు చేస్తున్నామని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు.